Sanju Samson: సంజు శాంసన్‌కు గాయం.. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరం

మోకాలి గాయంతో టీమ్‌ఇండియా బ్యాటర్‌ సంజు శాంసన్‌ శ్రీలంకతో జరగుతున్న టీ20 సిరీస్‌ నుంచి వైదొలిగాడు. తొలి మ్యాచ్‌లో బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో అతడి మోకాలికి గాయం అయింది. దీంతో నొప్పి ఎక్కువగా ఉండడంతో స్కాన్‌ తీశారు. వైద్య నిపుణుడి సలహా మేరకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నారు. 

Updated : 05 Jan 2023 01:24 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ నుంచి భారత బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌ గాయంతో వైదొలిగాడు. ముంబయి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో అతడి ఎడమ మోకాలుకు గాయమైంది. నొప్పి ఎక్కువగా ఉండడంతో బుధవారం శాంసన్‌కు స్కాన్‌ తీశారు. దీంతో వైద్య నిపుణుడి సలహా మేరకు మిగిలిన రెండు టీ20లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఇక సంజూ స్థానంలో వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మను జట్టులోకి తీసుకుంటున్నట్లు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. గత ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగిన జితేశ్‌ శర్మ 234 పరుగులు చేశాడు. 

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ కష్టంగా గెలిచింది. ఎన్నాళ్ల నుంచో జట్టులో సుస్థిర స్థానం కోసం వేచి చూస్తున్న శాంసన్‌కు ఈ సిరీస్‌ మంచి అవకాశంగా లభించింది. అయితే తొలి మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సంజు శాంసన్‌ కేవలం 5  పరుగులే చేసి ఔటై నిరాశపరిచాడు. ఇక శాంసన్‌ గాయంతో వైదొలగడంతో ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న రాహుల్‌ త్రిపాఠికి మ్యాచ్‌ ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. ఎన్నో రోజులుగా జట్టుతో ప్రయాణం చేస్తున్నప్పటికీ త్రిపాఠికి మ్యాచ్‌ ఆడే అవకాశం ఇంకా రాలేదు. ఇక గురువారం పుణె వేదికగా రెండో టీ20 జరగనుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు