Chennai : ధోనీలా సుదీర్ఘకాలం చెన్నైని నడిపించగలిగే సామర్థ్యం అతడికే ఉందట.. విశ్లేషించిన సెహ్వాగ్‌!

 చెన్నై జట్టు సారథి ఎంఎస్ ధోనీ ప్లేస్‌ను భర్తీ చేయగలిగే ఆటగాడెవరో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పేశాడు. అంతేకాదండోయ్‌.. ధోనీలా సుదీర్ఘకాలంపాటు..

Published : 15 May 2022 01:41 IST

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై జట్టు సారథి ఎంఎస్ ధోనీ ప్లేస్‌ను భర్తీ చేయగలిగే ఆటగాడెవరో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పేశాడు. అంతేకాదండోయ్‌.. ధోనీలా సుదీర్ఘకాలంపాటు నాయకత్వ బాధ్యతలను నిర్వహించగలిగే సత్తా కూడా ఆ యువ క్రికెటర్‌లో ఉందట.. ఇంతకీ అతడెవరో తెలుసా..? రుతురాజ్‌ గైక్వాడ్‌. అవునండీ గత సీజన్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి.. ప్రస్తుత సీజన్‌ ఆరంభంలో కాస్త తడబాటుకు గురై.. ఇప్పుడు కుదురుకుని రాణిస్తున్నాడు. ఈ సీజన్‌ మొదట్లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీని వదులుకొని రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే వ్యక్తిగతంగా విఫలం చెందడంతోపాటు చెన్నై వరుస పరాజయాల నేపథ్యంలో మరోసారి జట్టు పగ్గాలను ధోనీ అందుకున్నాడు. అయితే వచ్చే సీజన్‌లో ధోనీ కొనసాగుతాడా..? కెప్టెన్సీని నిర్వహిస్తాడా..? సారథ్యం చేయకపోతే ఎవరిని చెన్నైకి కొత్త కెప్టెన్‌గా నియమిస్తారు.. వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ధోనీ కొనసాగకపోతే మాత్రం రుతురాజ్‌ సరైన ఎంపికగా నిలుస్తాడని వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.

‘‘ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టుకు రుతురాజ్‌ కెప్టెన్సీ చేశాడు. చాలా నిశ్శబ్దంగా తనపని చేసుకుపోతాడు. బ్యాటింగ్‌లో సెంచరీ కొట్టినా.. లేకపోతే డకౌట్‌గా వెనుదిరిగినా ఎలాంటి భావోద్వేగం కనిపించనీయడు. అతడి ప్రవర్తనలోనూ మార్పు ఉండదు. అందుకే చెబుతున్నా చెన్నై జట్టు సారథ్యానికి రుతురాజ్‌ అర్హుడు. గేమ్‌ను ఎలా నియంత్రించాలో బాగా తెలుసు. ఇప్పుడు రుతురాజ్‌ వయస్సు కూడా చాలా తక్కువే. కాబట్టి చెన్నై తరఫున కనీసం నాలుగైదు సీజన్లు ఆడగలడు. ధోనీలా సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా రుతురాజ్‌ రాణిస్తాడు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. తుది నిర్ణయం తీసుకునేది చెన్నై యాజమాన్యమే కదా’’ అని సెహ్వాగ్‌ వివరించాడు.

ధోనీ కెప్టెన్సీలో ఎక్కువగా విజయవంతం కావడానికిగల కారణాలను కూడా సెహ్వాగ్‌ విశ్లేషించాడు. ‘‘ధోనీ చాలా కూల్‌. స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలడు. అంతేకాకుండా అదృష్టం ధోనీ వెంటే ఉంది. అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగే వారితోనే లక్‌ ఉంటుందనేది నానుడి. అలానే రతురాజ్‌లోనూ ఇలాంటి గుణాలే ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు. మరోవైపు సెహ్వాగ్‌ విశ్లేషణకు మరో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా మద్దతుగా నిలిచాడు. ‘‘రాబిన్‌, అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రావో వంటి సీనియర్లు మరింత కాలం ఆడలేరు. ఇప్పటికే రవీంద్ర జడేజాను ప్రయత్నించారు. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన దీపక్‌ చాహర్‌ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పినట్లు రుతురాజ్‌కు నా మద్దతు తెలుపుతున్నా’’ అని జడేజా వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని