T20 World Cup 2022: షమీ-షోయబ్‌ అలాంటివి చేయొద్దు: షాహిద్ అఫ్రిది

టీ20 ప్రపంచకప్‌ విజేతగా ఇంగ్లాండ్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో పాక్‌పై ఇంగ్లాండ్‌ విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకొంది. దీంతో పాక్‌ ఓటమిపై భారత క్రికెటర్ షమీ చేసిన ట్వీట్‌.. ప్రతిగా షోయబ్ అక్తర్ రీట్వీట్‌ వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో షాహిద్‌ అఫ్రిది ఇలాంటివి వద్దని ఇద్దరు ఆటగాళ్లకు సూచనలు చేశాడు.

Updated : 14 Nov 2022 15:52 IST

ఇంటర్నెట్ డెస్క్: తమ దాకా వస్తే కానీ బాధ తెలియదన్నట్లుగా ఉంది పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ల పరిస్థితి. టీమ్‌ఇండియా ప్రదర్శనపై ఒకలా.. పాక్‌ ఆటతీరుపై మరోలా స్పందిస్తూ ఉంటారు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో పాక్‌ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ఆటగాడు షమీ, పాక్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్ ట్విటర్‌ వేదికగా చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి. అయితే ఇలాంటివి చేయడం సరైంది కాదని తాజాగా పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నీతి కబుర్లు చెప్పాడు. 

‘‘క్రికెటర్లుగా మనమంతా రాయబారులం. భారత్, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ఆపేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. అంతే కానీ ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉండకూడదు. మనమే ఇలా చేస్తే.. చదువుకోని సామాన్యుడు ఇంకెలా ఆలోచిస్తాడు. వారి నుంచి ఇంకేమి ఆశిస్తాం? అందుకే మనం బంధాలు నిర్మించాలి. అందులోనూ క్రీడలు కీలక పాత్ర పోషించాలి. వారితో (భారత్‌) ఆడాలని కోరుకోవాలి. అలాగే ఆ జట్టు  పాక్‌లో పర్యటించాలని కోరుకుందాం. మీరు ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాడైతే అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒకవేళ ఇప్పుడు జట్టు తరఫున ప్లేయర్ అయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి’’ అని అఫ్రిది వ్యాఖ్యానించాడు. సూపర్ -12 దశలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అఫ్రిది భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. ఐసీసీ, బీసీసీఐ కలిసి టీమ్‌ఇండియాను ఎలాగైనా సెమీస్‌కు చేర్చాలని భావించాయని వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే అప్పటికి పాక్‌ సెమీస్‌ అవకాశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి.

ఇంతకీ షమీ-అక్తర్‌ మధ్య ఏం జరిగిందంటే?

ఫైనల్‌లో పాకిస్థాన్‌ ఓడిపోవడంతో టీమ్‌ఇండియా క్రికెటర్ షమీ ట్విటర్ వేదికగా ‘‘ సారీ బ్రదర్. దీనినే కర్మ అంటారు’’ అని ట్వీట్‌ చేశాడు. దీనికి షోయబ్‌ అక్తర్‌ హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశాడు. దీంతో సోషల్‌ మీడియాలో ఇది ఒక్కసారిగా వైరల్‌గా మారింది. పాక్‌ అభిమానులు, మాజీలు తమ అసహనం వ్యక్తం చేశారు. అయితే షమీ ట్వీట్‌కు ప్రతిస్పందనగా షోయబ్‌ అక్తర్‌ కూడా ప్రముఖ వ్యాఖ్యాత హర్షాభోగ్లే వ్యాఖ్యలను జత చేస్తూ ట్వీట్‌ చేశాడు. ‘‘చాలా తక్కువ జట్లు మాత్రమే 137 పరుగులను డిఫెండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తాయి. అత్యుత్తమ బౌలింగ్‌ దళం కలిగిన పాక్‌కు క్రెడిట్‌ ఇవ్వాలి’’ అని హర్షాభోగ్లే ట్వీట్‌ను షోయబ్ షేర్‌ చేసి ‘‘దీనిని తెలివైన ట్వీట్ అంటారు’’ అనే వ్యాఖ్యను జోడించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని