Shoaib Akhtar: అప్పుడు సచిన్‌ను ఔట్‌ చేయడమే నేను చేసిన పెద్ద తప్పు: అక్తర్

2008 టీ20 లీగ్‌ ఆరంభ సీజన్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను ముంబయిలో ఔట్‌ చేయడం తాను చేసిన పెద్ద తప్పు అని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు...

Published : 08 Apr 2022 16:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2008 టీ20 లీగ్‌ ఆరంభ సీజన్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను ముంబయిలో ఔట్‌ చేయడం తాను చేసిన పెద్ద తప్పు అని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. అలా చేయడం వల్ల తాను తీవ్ర మాటలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన అక్తర్‌.. నాటి లీగ్‌లో కోల్‌కతా బౌలర్‌గా వాంఖడేలో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే సచిన్‌ను ఔట్‌ చేశానన్నాడు.

‘‘ఆ రోజు వాంఖడే మొత్తం అభిమానులతో నిండిపోయి కళకళలాడుతోంది. అయితే, నేను తొలి ఓవర్‌లోనే సచిన్‌ను ఔట్‌ చేయడంతో వారందరికీ కోపం వచ్చింది. ఆరోజు నేను చేసిన పెద్ద తప్పు అదే. తర్వాత మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఫైన్‌లెగ్‌లో నేను ఫీల్డింగ్‌ చేస్తుండగా ప్రేక్షకుల నుంచి పరుష పదాలు వినిపించాయి. అప్పుడు గంగూలీ నా వద్దకు వచ్చి.. ‘మిడ్‌ వికెట్‌కు రా.. ఎవరు నిన్ను సచిన్‌ను ఔట్‌ చేయమన్నారు? అది కూడా ముంబయిలో. వాళ్లు నిన్ను చంపేస్తారు’ అని అన్నాడు’’ అని అక్తర్‌ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 15.2 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌటైంది. షాన్‌ పొలాక్‌ 3, డ్వేన్‌ బ్రావో 2, రోహన్‌ 2, డొమినిక్‌ 2 వికెట్లతో చెలరేగడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ (15) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఛేదనకు దిగిన ముంబయికి అక్తర్‌ తొలి ఓవర్‌లోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ ఆరంభమైన ఐదో బంతికే సచిన్‌ (0) డకౌట్‌గా పెవిలియన్‌ పంపాడు. అయితే, మరో ఓపెనర్‌ సనత్‌ జయసూర్య (48 నాటౌట్‌; 17 బంతుల్లో 6x4, 3x6) రెచ్చిపోయి ఆడాడు. రాబిన్‌ ఉతప్ప (9; 8 బంతుల్లో 2x4)తో కలిసి ధాటిగా ఆడి 5.3 ఓవర్లలోనే విజయాన్ని అందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని