IND vs PAK: 2011 సెమీస్‌లో పాక్‌ ఓడటం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా: అక్తర్‌

2011 వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో టీమ్‌ఇండియా చేతిలో పాకిస్థాన్‌ ఓటమిపాలవ్వడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు....

Published : 13 Jun 2022 01:51 IST

అప్పుడు నేనుంటే సచిన్‌, సెహ్వాగ్‌ను ఔట్‌ చేసేవాడిని

ఇంటర్నెట్‌డెస్క్‌: 2011 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో టీమ్‌ఇండియా చేతిలో పాకిస్థాన్‌ ఓటమిపాలవ్వడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. మొహాలి వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో అక్తర్‌ ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 260 పరుగులు సాధించగా.. లక్ష్య ఛేదనలో పాక్‌ 231 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో శ్రీలంకపై గెలిచింది.

తాజాగా నాటి మ్యాచ్‌ను గుర్తు చేసుకున్న అక్తర్‌.. ఆ రోజు తాను ఆడి ఉంటే సచిన్‌, సెహ్వాగ్‌ వికెట్లను ముందే పడగొట్టేవాడినని చెప్పాడు. ‘2011లో  మొహాలి వేదికగా జరిగిన సెమీఫైనల్స్‌లో పాక్‌ ఓటమి నన్నింకా వేధిస్తోంది. ఆ రోజు మా జట్టు యాజమాన్యం నన్ను ఆడించాల్సింది. అది సరైన నిర్ణయం కాదు. అప్పటికి నాకు చివరి రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయని అనుకున్నా. వాంఖడేలో ప్రపంచకప్‌ గెలిచి పాకిస్థాన్‌ జెండాను రెపరెపలాడించాలని గట్టిగా కోరుకున్నా. ఆ సమయంలో మాకన్నా భారత జట్టుపైనే తీవ్రఒత్తిడి ఉందన్న విషయం నాకు తెలుసు. అప్పుడు మీడియా, యావత్ భారత దేశం మొత్తం టీమ్‌ఇండియాపై భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఒత్తిడి వాళ్లకే అనుకున్నా. దీంతో మేం అండర్‌డాగ్స్‌లా ఉంటూ ఒత్తిడికి గురికావద్దని భావించా’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

ఇక సెమీఫైనల్‌కు ముందు తనని పక్కనపెట్టేయడంపై మాట్లాడిన అక్తర్‌.. ‘మ్యాచ్‌కు ముందే నేను ఫిట్‌గా లేనని చెప్పారు. దాంతో వార్మప్‌ సందర్భంగా మైదానంలోకి వెళ్లి నిరంతరాయంగా 8 ఓవర్లు బౌలింగ్‌ చేశా. అయినా, నన్ను తుది జట్టులోకి తీసుకోలేదు. ఆ రోజు నేను ఆడి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో తెలియదు. కానీ.. సచిన్‌, సెహ్వాగ్‌లను ముందే ఔట్‌ చేసేవాడిని. వాళ్లిద్దరు ఔటైతే టీమ్‌ఇండియా కుప్పకూలుతుందని నాకు తెలుసు. చివరికి మ్యాచ్‌ మొత్తం చూశాక పాక్‌ ఓటమిపాలవ్వడం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అప్పుడు నేను డ్రెస్సింగ్‌ రూమ్‌లోని కొన్ని వస్తువులను కూడా పగలగొట్టాను’ అని పేర్కొన్నాడు. కాగా, ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (85; 115 బంతుల్లో 11x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని