టీమ్‌ఇండియా భయ పడాల్సిన పనిలేదు: అక్తర్‌ 

భారత్ ‌x ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పలువురు ఇంగ్లాండ్‌ మాజీలతో పాటు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం విమర్శలు గుప్పించాడు...

Published : 03 Mar 2021 01:14 IST

ఏ పిచ్‌పైన అయినా కోహ్లీసేన గెలవగలదు..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్ ‌x ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పలువురు ఇంగ్లాండ్‌ మాజీలతో పాటు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం విమర్శలు గుప్పించాడు. ఇలాంటి పిచ్‌లపై టెస్టు క్రికెట్‌ నిర్వహించరాదన్నాడు. మొతేరా పిచ్‌పై బంతి మరీ ఎక్కువగా తిరిగిందని, అది టెస్టు క్రికెట్‌కు మంచిది కాదని అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానెల్లో చెప్పుకొచ్చాడు.

‘హోమ్‌ అడ్వాంటేజ్‌ను అర్థం చేసుకుంటాను. కాని, ఇది మరీ అతిగా అనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 400 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ 200 స్కోరుకు ఔటైతే.. అప్పుడు ఇంగ్లిష్‌ జట్టు బాగా ఆడలేదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ టీమ్‌ఇండియా కూడా 145 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ కన్నా కోహ్లీసేనే బలమైన జట్టని నేను భావిస్తున్నా. ఎలాంటి పిచ్‌ మీద ఆడినా టీమ్‌ఇండియా గెలుస్తుంది. వాళ్లు భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి వికెట్లు తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియాకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేశారా? అక్కడెలా గెలిచారు? సరైన పిచ్‌లపై బాగా ఆడి గెలుపొంది.. అప్పుడు మేం ఇంటా, బయటా బాగా ఆడగలమని చెప్పొచ్చు’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

అలాగే నాలుగో టెస్టుకు మంచి పిచ్‌ను తయారు చేస్తారనే అనుకుంటున్నా. ఎలాంటి వికెట్‌ మీదైనా గెలుపొందే సత్తా ఆ జట్టుకుందని బలంగా విశ్వసిస్తున్నా. కోహ్లీసేన హోమ్‌ అడ్వాంటేజ్‌ను తీసుకోవాల్సిన అవసరం లేదు. నాలుగో టెస్టులో మంచి పిచ్‌ తయారు చేసి బాగా ఆడండి. కచ్చితంగా మీరు గెలుస్తారనే నమ్మకం నాకుంది. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును దాని సొంతగడ్డపైనే ఓడించినప్పుడు స్వదేశంలో గెలవడం పెద్ద లెక్కా. చాలా తేలిగ్గా సిరీస్‌ గెలుస్తుంది’ అని పాక్‌ మాజీ పేసర్‌ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా, తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్‌.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కోహ్లీసేన నాలుగో టెస్టును సైతం తమ ఖాతాలో వేసుకొని.. సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌తో పోటీపడాలని పట్టుదలగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని