IPL: ఐపీఎల్‌కు రెడీ.. కెప్టెన్సీ గురించి తెలియదు 

భుజం గాయం కారణంగా కొద్దిరోజులుగా క్రికెట్‌కు దూరమైన దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈమధ్యే కోలుకున్నాడని చెప్పాడు. దాంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు...

Updated : 05 Jul 2021 19:55 IST

గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌ అయ్యర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భుజం గాయం కారణంగా కొద్దిరోజులుగా క్రికెట్‌కు దూరమైన దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ మధ్యే కోలుకున్నాడట. దాంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నానని, పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరో నెలరోజుల సమయం పడుతుందని అన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించాడు.

‘నా భుజానికి అయిన గాయం పూర్తిగా నయమైంది. అయితే, నేనిప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే క్రమంలో ఉన్నాను. అందుకు సంబంధించి ట్రెయినింగ్‌ కూడా మొదలుపెట్టాను. దానికి మరో నెలరోజుల సమయం పడుతుంది. ఇది పక్కనపెడితే, నేను ఐపీఎల్‌లో ఆడతాననే నమ్మకం ఉంది. అయితే, నేను ఆడినప్పుడు కెప్టెన్సీ చేస్తానా లేదా అనే విషయం నాకు తెలియదు. అది జట్టు యాజమాన్యం చేతుల్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడుతోంది. టాప్‌లో నిలిచింది. నాకదే ముఖ్యం. నా లక్ష్యం మేం కప్పు సాధించడమే’ అని శ్రేయస్‌ వివరించాడు.

అనంతరం అశ్విన్‌ను మన్కడింగ్‌ చేయకుండా ఒప్పించే విషయంపై మాట్లాడిన శ్రేయస్‌ అలా చేయడానికి కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. ‘‘అశ్విన్‌ దిల్లీ జట్టులో చేరినప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది. మన్కడింగ్‌ చేయడానికి దిల్లీ జట్టు వ్యతిరేకమని నేనూ, పాంటింగ్‌ అతడికి చెప్పి చూశాము. దాంతో మేం చెప్పినదానికి కట్టుబడి ఉంటానన్నాడు. మేం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూనే ఒక మెలిక పెట్టాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ అతి చేయనంతవరకు మాత్రమే అలా చేయనని మాతో అన్నాడు’ అని శ్రేయస్‌ గుర్తుచేసుకున్నాడు. కాగా, మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్‌ బంతిని ఆపే క్రమంలో డైవ్‌చేసి కిందపడ్డాడు. దాంతో అతడి ఎడమ భుజానికి గాయమైంది. తర్వాత సర్జరీ చేయడంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే జట్టు యాజమాన్యం పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. అతడు అంచనాలకుమించి రాణించి జట్టును టాప్‌లో నిలిపాడు. అయితే, కరోనా కేసుల కారణంగా ఈ సీజన్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. దాన్ని సెప్టెంబర్‌లో యూఏఈలో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే శ్రేయస్‌ అప్పటివరకూ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని