WTC Final: ఐపీఎల్‌తో ఆత్మవిశ్వాసం వచ్చినా.. ఇది విభిన్నం: శుభ్‌మన్‌ గిల్

గత డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన టీమ్‌ఇండియా.. మరోసారి వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం  వదలకూడదని టీమ్‌ఇండియా భావిస్తోంది.

Published : 06 Jun 2023 14:33 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final) టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్‌తో భారత్‌ తలపడనుంది. గత రెండు నెలల నుంచి ఐపీఎల్‌లో ఆడిన ఆటగాళ్లు టెస్టు మజాను అందించడానికి సిద్ధమవుతున్నారు. ఐపీఎల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ శుభ్‌మన్‌ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌తో పోలిస్తే టెస్టులు విభిన్నంగా ఉంటాయని.. ఐపీఎల్‌లో అత్యుత్తమంగా ఆడటంతో వచ్చిన ఆత్మవిశ్వాసం తప్పకుండా అక్కరకొస్తుందని పేర్కొన్నాడు. 

‘‘ఇప్పుడు ఈ టెస్టు గురించి ప్రాక్టీస్ చేస్తుంటే సరదాగా అనిపిస్తుంది. గత వారం రోజుల కిందట వరకు మేం డిఫరెంట్‌ గేమ్‌ను ఆడాం. ఇప్పుడు మాత్రం టెస్టు ఆడబోతున్నాం. దీంతో మా ముందు ఓ కఠిన సవాల్‌ నిలిచింది. టెస్టు క్రికెట్‌కు ఎంత త్వరగా కుదురుకోగలమనేదే కీలకం. కివీస్‌తో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ నేను భాగమయ్యా. గత ఓటమి నుంచి తప్పకుండా పాఠాలు నేర్చుకుంటాం. ప్రత్యేకించి బ్యాటింగ్‌కు సంబంధించి ఎన్నో అంశాల్లో మెరుగ్గా ఉన్నాం’’ అని గిల్ తెలిపాడు. 

వాటిని అధిగమిస్తాం: పుజారా

‘‘గత పొరపాట్లను అధిగమించి ఈసారి రాణిస్తామనే నమ్మకం ఉంది. ఇప్పటికే మా సన్నద్ధత అద్భుతంగా సాగుతోంది.  చాలా మంది క్రికెటర్లు నాణ్యమైన క్రికెట్‌ ఆడినవారే. ఇంగ్లాండ్‌లోనూ ఆడిన అనుభవం వారికి ఉంది. ప్రతి ఒక్కరి బలాలు తెలుసు. ఆసీస్‌తో ఎన్నో మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి వారి బలహీనతలపై మాకు అంచనాలు ఉన్నాయి’’ అని సీనియర్‌ బ్యాటర్ ఛెతేశ్వర్‌ పుజారా వ్యాఖ్యానించాడు. పుజారా గత రెండు నెలల నుంచి ఇంగ్లాండ్‌లోనే కౌంటీ క్రికెట్‌ ఆడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని