Wasim Jaffer: ‘టీమ్‌ఇండియాలో విరాట్ కోహ్లీ తర్వాత అతడే స్టార్‌ ఆటగాడు’

భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ స్టార్‌ ఆటగాడిగా నిలుస్తాడని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ కితాబిచ్చాడు. తన దృష్టిలో అతడు మూడు ఫార్మాట్లు ఆడగలిగే ప్లేయర్‌ అని పేర్కొన్నాడు.

Updated : 17 Dec 2022 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాణించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో వచ్చిన గిల్‌ బంగ్లాపై తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటాడు. 147 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని 110 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. టెస్టుల్లో అతడికిదే మొదటి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో శుభ్‌మన్‌ గిల్‌పై భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ స్టార్‌ ఆటగాడిగా నిలుస్తాడని కితాబిచ్చాడు. తన దృష్టిలో అతడు మూడు ఫార్మాట్లు ఆడగలిగే ప్లేయర్‌ అని పేర్కొన్నాడు. 

‘గిల్‌కు ఇంతకు ముందు కొన్ని అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పటికైనా గిల్‌ టెస్టుల్లో తొలి సెంచరీ సాధించడం సంతోషంగా ఉంది. అతడో క్లాస్‌ ప్లేయర్. టీమ్‌ఇండియాలో విరాట్‌ కోహ్లీ తర్వాత అంతటి స్థాయి ఆటగాడిగా ఎదుగుతాడని నేను భావిస్తున్నా. అతడు మూడు ఫార్మాట్లలో ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్‌. బంగ్లాతో రెండో టెస్టు కోసం రోహిత్‌ శర్మ జట్టులోకి వచ్చినా గిల్‌ని తుది జట్టులో ఉంచుతారని భావిస్తున్నా. ఓపెనర్లు  మిడిల్‌ ఆర్డర్‌లో ఆడటం పెద్ద విషయమేమీ కాదు. గతంలో గిల్‌ పంజాబ్‌ జట్టుకు ఆ స్థానంలో ఆడాడు. అతడు ఐదు లేదా మరే స్థానంలోనైనా ఆడేందుకు సరిపోతాడు’ అని జాఫర్‌ వివరించాడు. 

గిల్‌తో కేఎల్‌కు రాహుల్‌కు ఇబ్బంది: ఆకాశ్ చోప్రా 

శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి రావడం కేఎల్ రాహుల్‌కు సమస్యగా మారుతుందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. బంగ్లాతో తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన సంగతి తెలిసిందే. రెండో టెస్టు కోసం కెప్టెన్‌ రోహిత్ అందుబాటులో ఉంటాడని సమాచారం. అదే జరిగితే రోహిత్‌కి ఓపెనింగ్‌ జోడీగా ఎవరస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గిల్‌ ఫామ్‌ కేఎల్‌కు సమస్యగా మారొచ్చని పేర్కొన్నాడు. ‘కేఎల్ రాహుల్‌ అద్భుతమైన ఆటగాడు. కానీ, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోరుకే ఔట్‌ కావడం అతడికి ఇబ్బందిగా మారింది. మరోవైపు, శుభ్‌మన్‌ గిల్‌ శతకంతో రాణించాడు. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తే ఎవరు బయటకు వెళ్తారు? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గిల్‌ని పక్కన పెడతారా?’అని ఆకాశ్‌ చోప్రా విశ్లేషించాడు.  

ఆ అనుభూతిని ఆస్వాదించనివ్వండి: అజయ్‌ జడేజా 

టెస్టు కెరీర్‌లో తొలి శతకం బాదిన శుభ్‌మన్‌ గిల్‌ని భారత మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా ప్రశంసించాడు.  ‘టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ సాధించడం అనేది చాలా ప్రత్యేకమైనది. ఆ అనుభూతి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే.. కానీ చాలా ముఖ్యమైనది. సెంచరీ చేయడం అనేది పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లే.  ఇది అలాంటి ప్రభావాన్నే చూపుతుంది. శుభ్‌మన్ గిల్ ఆ అనుభూతిని ఆస్వాదించనివ్వండి.  18 సెంచరీలు బాదిన ఛెతేశ్వర్ పుజారా దాదాపు నాలుగేళ్ల తర్వాత సెంచరీ చేశాడు. ఇదొక విభిన్నమైన అనుభూతి ’ అని అజయ్‌ జడేజా అన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని