కోహ్లీకి లేని రికార్డు ‘స్మృతి’ కొట్టేసింది!

టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన అరుదైన ఘనత అందుకొంది. అంతర్జాతీయ క్రికెట్లో మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించింది. ఛేదనల్లో వరుసగా పదోసారి 50+ స్కోరు సాధించింది. ఛేదన రారాజు విరాట్‌ కోహ్లీకి ఇలాంటి రికార్డు లేకపోవడం గమనార్హం...

Published : 09 Mar 2021 19:58 IST

ఛేదనల్లో వరుసగా పదోసారి 50+ స్కోరు చేసిన మంధాన

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన అరుదైన ఘనత అందుకొంది. అంతర్జాతీయ క్రికెట్లో మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించింది. ఛేదనల్లో వరుసగా పదోసారి 50+ స్కోరు సాధించింది. ఛేదన రారాజు విరాట్‌ కోహ్లీకి ఇలాంటి రికార్డు లేకపోవడం గమనార్హం. పూనమ్‌ రౌత్‌ (62*; 89 బంతుల్లో 8×4)కు తోడుగా మంధాన (80*; 64 బంతుల్లో 10×4, 3×6) చెలరేగిన వేళ దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

లఖ్‌నవూలోని వాజ్‌పేయి స్టేడియంలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలను టీమ్‌ఇండియా 41 ఓవర్లకు కేవలం 157 పరుగులకే కుప్పకూల్చింది. సీనియర్‌ పేసర్‌ జులన్ గోస్వామి (4/42), రాజేశ్వరీ గైక్వాడ్‌ (3/37), మాన్సి జోషి (2/23) తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని వణికించారు. సున్ లూస్‌ (36), లారా గుడ్‌ఆల్‌ (49) టాప్‌ స్కోరర్లు. మోస్తారు లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 22 వద్ద జెమీమా రోడ్రిగ్స్‌ (9; 20 బంతుల్లో 1×4)ను ఇస్మాయిల్‌ బౌల్డ్‌ చేసింది. ఈ క్రమంలో విజృంభించిన ఆడిన స్మృతి, పూనమ్‌ భారీ షాట్లు బాదారు. అజేయ అర్ధశతకాలు సాధించారు. 28.4 ఓవర్లలోనే జట్టుకు విజయం అందించారు.

సాహో.. స్మృతి

వన్డే కెరీర్లో 53 వన్డేలాడిన స్మృతి 44.14 సగటుతో 2119 పరుగులు చేసింది. 4 శతకాలు, 18 అర్ధశతకాలు సాధించింది. ఇందులో 24 మ్యాచుల్లో టీమ్‌ఇండియా ఛేదనకు దిగింది. దూకుడుగా ఆడే మంధాన వీటిలో 63.26 సగటుతో 1202 పరుగులు చేసింది. 2 సెంచరీలు, 12 అర్ధశతకాలు సాధించింది. అందులో 10 అర్ధశతకాలు వరుసగా సాధించడం ప్రత్యేకం. 2018, మార్చి 15 నుంచి ప్రతి ఛేదనలోనూ ఆమె 50+ స్కోర్లు చేసింది. 67, 52, 86, 53*, 73*, 105*, 90*, 63, 74, 80*తో విజృంభించింది. ఇంగ్లాండ్‌పై 3, ఆసీస్‌, న్యూజిలాండ్‌పై 2, శ్రీలంక, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాపై ఒక్కోసారి 50+ స్కోరు సాధించింది. పురుషుల క్రికెట్లోనూ ఇలాంటి రికార్డు ఎవరికీ లేకపోవడం గమనార్హం. పాక్‌ దిగ్గజం జావెద్‌ మియాందాద్ వరుసగా 9 అర్ధశతకాలు చేశాడు. ప్రత్యేకించి ఛేదనల్లో కాదు. ఛేదన రారాజు విరాట్‌ చేసిందీ వరుసగా 5 అర్ధశతకాలే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని