T20 Cricket: టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా..

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా (South Africa) జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది. 

Published : 27 Mar 2023 14:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సాధారణంగా టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో 200కు మించి  స్కోర్లు నమోదు కావు.  కొన్నిసార్లు 230-240 వరకూ నమోదైన సందర్భాలున్నాయి. కానీ, ఆ స్కోర్లను ఛేదించడంలో చాలా జట్లు చతికిలపడతాయి. కానీ, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా (WI vs SA) మధ్య జరిగిన రెండో టీ20లో ఒక జట్టును మించి మరొకటి స్కోర్లను నమోదు చేశాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. విండీస్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని 7 బంతులు మిగిలుండగానే ఛేదించి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 245 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఛేజింగ్‌ కాగా.. తాజా మ్యాచ్‌తో ఆసీస్‌ రికార్డును దక్షిణాఫ్రికా బద్దలు కొట్టింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. జాన్సన్‌ చార్లెస్‌ (118; 46 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించడతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. చార్లెస్‌ 39 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో వెస్టిండీస్‌ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. కైల్ మేయర్స్‌ (51; 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), రొమారియో షెపర్డ్ (41; 18 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. 

సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌ (100; 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు)  అద్భుతమైన శతకం బాదాడు. రిజా హెండ్రిక్స్‌ (68; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో 7 బంతులు మిగిలుండగానే 259 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 35 సిక్సర్లు నమోదయ్యాయి. ఓ టీ20 మ్యాచ్‌లో ఇన్ని సిక్సర్లు బాదడం ఇదే తొలిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని