CSK vs GT: ‘ఫైనల్‌’ ఓవర్‌లో హార్దిక్‌ అలా ఎందుకు చేశాడో..?: సునీల్ గావస్కర్

రెండోసారి వరుసగా ఛాంపియన్‌గా నిలుద్దామనే గుజరాత్ (GT) ఆశలకు చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బ్రేక్‌ వేశాడు. చివరి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా మలిచి సీఎస్‌కేను (CSK) విజేతగా నిలిపాడు.  

Updated : 31 May 2023 15:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (IPL)లో  చెన్నై సూపర్ కింగ్స్‌ ఐదోసారి విజేతగా నిలిచి ముంబయితో సమంగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను చివరి బంతికి చిత్తు చేసి టైటిల్‌ను సీఎస్‌కే ఎగరేసుకుపోయింది. సీఎస్‌కే ఛేదన సమయంలో 19.4 ఓవర్ల వరకు గుజరాత్ టైటాన్స్‌ పైచేయి సాధించింది. వరుసగా రెండోసారి విజేతగా నిలుద్దామని భావించిన తరుణంలో.. చివరి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా మలిచి రవీంద్ర జడేజా సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్‌ను వేసిన మోహిత్‌ శర్మ నాలుగు బంతుల్లో కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. అలాంటి సమయంలో మోహిత్ బౌలింగ్‌ రిథమ్‌ను దెబ్బ తీసేలా కెప్టెన్ హార్దిక్‌ పాండ్య బ్రేక్‌ తీసుకోవడంపై క్రికెట్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా సునీల్ గావస్కర్‌ గుజరాత్ కెప్టెన్‌ నిర్ణయంపై చురకలు అంటించాడు. 

‘‘మోహిత శర్మ చాలా అనుభవం ఉన్న బౌలర్. చివరి ఓవర్‌లో నాలుగు బంతులను అద్భుతంగా వేశాడు. కారణం ఏంటో తెలియదు.. ఓవర్‌ మధ్యలో మంచినీటిని తాగుతూ కనిపించాడు. అప్పుడే హార్దిక్ పాండ్య వచ్చి మాట్లాడాడు. ఓ బౌలర్‌ మంచి రిథమ్‌తో బౌలింగ్‌ చేస్తున్నప్పుడు అతడికి ఎలాంటి సూచనలు ఇవ్వకూడదు. కాస్త దూరంగా ఉండి ‘బాగా బౌలింగ్‌ చేశావు’ అని మాత్రమే అనాలి. వారి దగ్గరికి వెళ్లి మాట్లాడటం, ఏదొకటి చెప్పడం సరైంది కాదు. అలాంటప్పుడు బౌలర్‌ అయోమయం చెందే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు కూడా అదే జరిగింది. తర్వాతి రెండు బంతులకు మోహిత్ పరుగులు ఇచ్చేశాడు’’ అని సునీల్ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. 

సీఎస్‌కేతో ఫైనల్‌ మ్యాచ్‌లో మోహిత్ శర్మ అజింక్య రహానె, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ వికెట్లను పడగొట్టాడు. అప్పటిదాకా మంచి లయతో బౌలింగ్‌ వేసిన మోహిత్.. చివరి రెండు బంతులను సరైన లెంగ్త్‌లో సంధించలేక విఫలమై తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఇప్పటి వరకు  ఈ సీజన్‌లో 27 వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ రేసులో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ బౌలర్‌ కావడం విశేషం. మహమ్మద్‌ షమీ 28 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని