AFG vs NZ: ఇప్పుడు ఒత్తిడంతా అఫ్గాన్‌ - కివీస్‌లపైనే: గావస్కర్

టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసు రసవత్తరంగా మారింది. గ్రూప్‌-1 నుంచి ఇంగ్లాండ్‌.. గ్రూప్‌-2 నుంచి పాకిస్థాన్‌ ఇప్పటికే సెమీస్‌ చేరాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి...

Published : 06 Nov 2021 13:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసు రసవత్తరంగా మారింది. గ్రూప్‌-1 నుంచి ఇంగ్లాండ్‌.. గ్రూప్‌-2 నుంచి పాకిస్థాన్‌ ఇప్పటికే సెమీస్‌ చేరాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లతో గ్రూప్‌-1 నుంచి ఏ జట్టు సెమీస్‌కు చేరుతుందో తెలిసిపోనుండగా.. ఆదివారం అఫ్గాన్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో గ్రూప్‌-2 నుంచి ఏ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుందో స్పష్టత రానుంది. అయితే, ఈ మ్యాచ్‌ ద్వారా ఆ రెండు జట్లూ ఒత్తిడికి గురవుతాయని టీమ్‌ఇండియా మాజీ సారథి, బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

తాజాగా టీమ్‌ఇండియా.. స్కాట్లాండ్‌పై 81 బంతులు మిగిలుండగానే ఘన విజయం సాధించడంతో గ్రూప్‌-2లో మిగతా జట్ల కన్నా మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ (1.619) సాధించింది. దీంతో సెమీస్‌ పోరులో అది న్యూజిలాండ్‌ (1.277), అఫ్గాన్‌ (1.481) అవకాశాలకు గండికొట్టే ప్రమాదం ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే ఇప్పటికే ఆరు పాయింట్లతో ఉన్న విలియమ్సన్‌ టీమ్‌ నేరుగా సెమీస్‌ చేరుతుంది. అదే అఫ్గాన్‌ గెలిస్తే.. టీమ్‌ఇండియాతో సమానంగా నాలుగు పాయింట్లతో ఉండటం వల్ల రన్‌రేట్‌ విషయంలో పోటీపడాల్సి ఉంటుంది. అప్పుడు కోహ్లీసేన చివరి మ్యాచ్‌లో నమీబియాను ఎంత తేడాతో ఓడిస్తే సరిపోతుందో లెక్క తేలనుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే మ్యాచ్‌ అటు అఫ్గాన్‌లో, ఇటు న్యూజిలాండ్‌లో ఒత్తిడి పెంచుతుందని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఈ మ్యాచ్‌ ఫలితంపై ఇప్పుడు రెండు జట్ల మీదా ఒత్తిడి ఉంది. ఇదివరకు ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు టీమ్‌ఇండియా రన్‌రేట్‌ తక్కువగా ఉండేది. అయితే, ఇప్పుడు ఆ రెండు జట్ల కన్నా భారత్‌ రన్‌రేటే మెరుగ్గా ఉండటంతో ఆ రెండు జట్లపై ఒత్తిడి నెలకొంది’ అని గావస్కర్‌ ఓ జాతీయ మీడియాతో అన్నాడు. ఇక స్కాట్లాండ్‌ మ్యాచ్‌పై స్పందిస్తూ.. టీమ్‌ఇండియా అదరగొట్టిందని ప్రశంసించాడు. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిందన్నాడు. 86 పరుగుల ఛేదనలో టీమ్‌ఇండియా లెక్కలు తెలుసుకునే బ్యాటింగ్‌ చేసిందని మెచ్చుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని