Virat Kohli: కోహ్లీతో పాటు బెంగళూరుకు కావాల్సింది ఇదే: గావస్కర్

బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గుజరాత్‌తో ఆడిన మ్యాచ్‌లో అర్థశతకం సాధించడం ద్వారా తనకు కావాల్సిన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు...

Published : 02 May 2022 01:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గుజరాత్‌తో ఆడిన మ్యాచ్‌లో అర్థశతకం సాధించడం ద్వారా తనకు కావాల్సిన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. కోహ్లీ నుంచి బెంగళూరు జట్టు కూడా ఇదే ఆశిస్తుందని చెప్పాడు. ఇప్పటికే 5 విజయాలు, 5 ఓటములతో కొనసాగుతున్న ఆ జట్టుకు అతడు తిరిగి ఫామ్‌లోకి రావడం ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 0, 0, 9 పరుగులతో విఫలమైన కోహ్లీ (58; 53 బంతుల్లో 6x4, 1x6) గుజరాత్‌తో మెరిశాడు. ఈ నేపథ్యంలో గావస్కర్‌ స్పందించాడు.

‘కోహ్లీతో పాటు బెంగళూరు జట్టుకు కావాల్సింది ఇదే. ఒక్కసారి అతడు గాడిలో పడి అర్ధశతకం సాధిస్తే మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇలాగే రాణించడానికి దోహదపడుతుంది. ఇలాంటి కీలక బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయడం చాలా మంచి విషయం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ క్రీజులో ఉండగా తన కాలి కదలికలు కూడా బాగున్నాయి. ఇది అతడికి ఆత్మవిశ్వాసం పెంపొందించే ఇన్నింగ్స్‌. దీంతో బెంగళూరు జట్టు కూడా చాలా సంతోషించి ఉంటుంది’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. అనంతరం యువ బ్యాట్స్‌మన్‌ రజత్‌ పాటిదార్‌ గురించి మాట్లాడిన సన్నీ.. మూడో స్థానంలో ఈ యువకుడు సరిగ్గా సరిపోయాడని చెప్పాడు. డుప్లెసిస్‌ ఔటయ్యాక టాప్‌క్లాస్‌ బ్యాటింగ్‌ చేశాడని మెచ్చుకున్నాడు. అతడు జట్టు నమ్మకాన్ని కాపాడినట్టు చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని