INDvsSL: సున్నా నుంచే మొదలుపెడతా 

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అరంగేట్రంలోనే అదరగొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌ రాబోయే శ్రీలంక సిరీస్‌లో మళ్లీ సున్నా నుంచి మొదలుపెడతానని అంటున్నాడు. ప్రస్తుతం కొలంబోలో క్వారంటైన్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌...

Published : 06 Jul 2021 18:34 IST

లంక పర్యటనపై సూర్యకుమార్‌ యాదవ్‌..

కొలంబో: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అరంగేట్రంలోనే అదరగొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌ రాబోయే శ్రీలంక సిరీస్‌లో మళ్లీ సున్నా నుంచి మొదలుపెడతానని అంటున్నాడు. ప్రస్తుతం కొలంబోలో క్వారంటైన్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని భారత జట్టులో సూర్య ఒకడనే సంగతి తెలిసిందే. ఇప్పుడా జట్టు అక్కడ కఠోర సాధన చేస్తోంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు ఇంట్రా-స్క్వాడ్‌ మ్యాచ్‌లు ఆడుతూ తమని తాము మెరుగుపర్చుకుంటున్నారు. అయితే, తాజాగా సూర్యకుమార్‌ వర్చువల్‌ పద్ధతిలో మీడియాతో మాట్లాడుతూ లంక పర్యటనపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. అలాగే రాహుల్‌ ద్రవిడ్‌ లాంటి దిగ్గజంతో తొలిసారి కలిసి పనిచేస్తున్నానని చెప్పాడు. దాంతో అతని నుంచి మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు.

‘లంకతో తలపడేటప్పుడు కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. అది లేకపోతే ఉత్సాహం ఉండదు. ఈ పర్యటన మాకు సవాళ్లతో కూడుకున్నది. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మరోవైపు ఇంగ్లాండ్‌తో అరంగేట్రం చేసిన సిరీస్‌కూ, ఈ సిరీస్‌కూ పోలికే లేదు. రెండూ వేర్వేరైనా సవాళ్లు ఒకే రీతిలో ఉంటాయి. ఈ క్రమంలోనే లంకతో ఆడేటప్పుడు నా ఆటను మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలనుకుంటున్నా. ఇదివరకు ఎలా ఆడానో ఇప్పుడూ అలాగే ఆడాలనుకుంటున్నా’ అని ముంబయి బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శ్రీలంక పర్యటన నిర్వహించడం గొప్ప విశేషమని, అది తమకు మంచి అవకాశమని సూర్యకుమార్‌ అన్నాడు. ఆటగాళ్లు ఇక్కడ రాణించి తమని, తాము నిరూపించుకోవడం సవాళ్లతో కూడుకున్నది చెప్పాడు. అలాగే రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి తొలిసారి పనిచేస్తున్నట్లు చెప్పాడు. ‘అతనితో ఇదే నా తొలి పర్యటన. తన గురించి చాలా గొప్పగా విన్నా. ద్రవిడ్‌ నేతృత్వంలో మరెన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నా’ అని సూర్య పేర్కొన్నాడు.

ఇక ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడినట్లే భారత జట్టులోనూ ఆడతానని ఈ యువ బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు. అనంతరం హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌పై స్పందిస్తూ.. అతడు ఇంట్రా-స్క్వాడ్‌ మ్యాచ్‌లో బంతులేశాడని, అలాగే ఇంగ్లాండ్‌తో టీ20ల్లోనూ బౌలింగ్‌ చేశాడని సూర్య గుర్తుచేశాడు. ఇప్పుడైతే హార్దిక్‌ బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఆ నిర్ణయం అతడూ, జట్టు యాజమాన్యం తీసుకోవాలన్నాడు. ఇక అక్కడి పరిస్థితులకు అలవాటు పడటంపై మాట్లాడుతూ ఇలాంటి ఉక్కపోత పరిస్థితుల్లో తాము ఇదివరకు ఆడామని, చెన్నై, ముంబయిలాంటి నగరాల్లోనూ అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉంటాయని సూర్య వెల్లడించాడు. అలాగే తాము అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికే 15-20 రోజుల ముందుగా వచ్చామన్నాడు. దాంతో ఎలాంటి సమస్య ఉండదని అభిప్రాయపడ్డాడు. చివరగా తమ జట్టును ద్వితీయశ్రేణి జట్టుగా అభివర్ణించడాన్ని సూర్య కొట్టిపారేశాడు. తాము ఆ విషయం గురించి ఆలోచించడంలేదని తేల్చిచెప్పాడు. శ్రీలంకకు క్రికెట్‌ ఆడేందుకు వచ్చామని, ఆ సిరీస్‌లను సానుకూల పరిస్థితుల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నామని యువ బ్యాట్స్‌మన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని