Suryakumar Yadav : ఇది ‘స్కై’ భిన్నమైన వెర్షన్‌ : తన ఇన్నింగ్స్‌పై సూర్య స్పందన ఇది..

ఎంతో దూకుడుగా ఆడే సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) న్యూజిలాండ్‌తో రెండో టీ20(IND Vs NZ)లో తన స్వభావానికి విరుద్ధంగా ఆడాడు. పరిస్థితులకు అనుగుణంగా బాధ్యతయుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Updated : 30 Jan 2023 12:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంతి కనిపిస్తే చాలు బౌండరీ ఆవలకు తరలించడమే పనిగా పెట్టుకుంటాడు టీమ్‌ఇండియా మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav)‌. అలాంటి విధ్వంసకర వీరుడు కూడా నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 (IND Vs NZ)లో తన స్వభావానికి విరుద్ధంగా ఆడాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎంతో బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌ నిర్మించాడు. తన దూకుడును పక్కనబెట్టి.. 31 బంతుల్లో 26 పరుగులు చేశాడంటే  పిచ్‌ ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో ఒక్క సిక్స్‌ కూడా రాలేదు. స్కై(SKY) కూడా ఒక్క ఫోరే కొట్టగలిగాడు. న్యూజిలాండ్‌పై రెండో టీ20లో వంద పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్‌ఇండియా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరికి భారత్‌తే విజయం అయినా.. అత్యంత కఠినమైన ఇలాంటి పిచ్‌పై రెండు జట్ల పోరాటం ఆకట్టుకుంది. ఇలాంటి ఛాలెంజింగ్‌ పిచ్‌పై పరిస్థితులకు అనుగుణంగా ఆడినట్లు స్కై మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ వెల్లడించాడు.

‘‘ఈ రోజు స్కై భిన్నమైన వెర్షన్‌ను చూశారు. నేను బ్యాటింగ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ఎంతో ముఖ్యం. వాషింగ్టన్‌ వికెట్‌ కోల్పోయిన అనంతరం.. ఎవరో ఒకరు ఆటను చివరి వరకూ తీసుకెళ్లాలి. వాషింగ్టన్‌ రనౌట్‌లో నా తప్పిదమే ఉంది.  అక్కడ కచ్చితంగా పరుగు లేదు. ఇక పిచ్‌ చాలా కఠినంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇలా టర్న్‌ అవుతుందని అనుకోలేదు. అయితే.. దానికి తగ్గట్టు మారడం ముఖ్యం.  మాలో టెన్షన్‌ తగ్గించుకోవడానికి చివరి ఓవర్‌లో మాకు పెద్ద షాట్‌ కావాలి. అదే సమయంలో హార్దిక్‌ నా వద్దకు వచ్చి ‘నువ్వు ఈ బంతికి పూర్తిచేయబోతున్నావు’ అని చెప్పాడు. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’’ అని సూర్య తెలిపాడు.

ఈ పిచ్‌ షాకింగ్‌కు గురి చేసింది: హార్దిక్‌

ఇక ఈ టీ20 సిరీస్‌కు రూపొందిస్తున్న పిచ్‌లపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) కూడా మండిపడ్డాడు. ‘‘నిజం చెప్పాలంటే.. ఈ పిచ్‌ షాక్‌కు గురిచేసింది. ఈ రెండు మ్యాచ్‌లకు కఠినమైన పిచ్‌లే ఉన్నాయి. టీ20ల కోసం వాటిని రూపొందించలేదు. అయితే నేను వాటిని పట్టించుకోను. 120 పరుగులు కూడా గెలుపు స్కోర్‌ అవుతుంది’’ అని హార్దిక్‌ అన్నాడు.

రెండో టీ20లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమ్‌ఇండియా సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్‌కు చాలా కష్టమైన పిచ్‌పై భారత బౌలర్ల ధాటికి మొదట న్యూజిలాండ్‌ 8 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. లక్ష్యాన్ని టీమ్‌ఇండియా కష్టంగానే ఛేదించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని