T20 League : పొట్టి ఫార్మాట్లో హ్యాట్రిక్‌ వికెట్ల వీరులు వీళ్లే..!

టీ20 క్రికెట్‌ అంటేనే రసవత్తర పోర్లకు అసలైన వేదిక. ఇలాంటి ఆటలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ధాటిగా ఆడే బ్యాట్స్‌మన్‌ ఊహించని విధంగా ఔటవ్వచ్చు...

Updated : 26 Mar 2022 12:59 IST

యువీ, రోహిత్‌, అమిత్‌ మిశ్రా మేటి రికార్డులు..

టీ20 క్రికెట్‌ అంటేనే రసవత్తర మ్యాచ్‌లకు అసలైన వేదిక. ఇలాంటి ఆటలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ధాటిగా ఆడే బ్యాట్స్‌మన్‌ ఊహించని విధంగా ఔటవ్వచ్చు. ధారాళంగా పరుగులిచ్చే బౌలర్‌ అనూహ్యంగా వికెట్లు సాధించొచ్చు. దీంతో క్షణాల్లో మ్యాచ్‌ల ఫలితాలే తారుమారు అవ్వచ్చు. అలా ఐపీఎల్‌లోనూ ఉన్నపళంగా చెలరేగి రెప్పపాటులో ఫలితాలను తలకిందులు చేసిన హ్యాట్రిక్‌ వికెట్ల వీరులూ ఉన్నారు. రెండు రోజుల్లో 15వ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఎవరెవరు హ్యాట్రిక్‌లు సాధించారు. వారి విశేషాలేంటో ఓసారి చూద్దాం.!

  • చెన్నై మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజి టీ20 లీగ్‌లో తొలి హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 2008 ఆరంభ సీజన్‌లోనే అతడు పంజాబ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో (5/24) మెరుగైన బౌలింగ్‌ చేశాడు. అప్పుడు అతడు చివరి ఓవర్‌లో ఇర్ఫాన్ పఠాన్‌ (40), పీయుష్‌ చావ్లా (17), విక్రమ్‌ సింగ్‌లను(0) వరుస బంతుల్లో పెవిలియన్‌కి పంపాడు.
  • ఈ మెగా టోర్నీలో అత్యధికంగా మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక బౌలర్‌ ప్రముఖ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా. అతడు 2008లో దిల్లీ తరఫున ఆడగా.. అప్పటి హైదారాబాద్‌ జట్టుపై (5/17) తొలిసారి హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. ఆపై 2011లో పంజాబ్‌ జట్టుపైనా (4/9) రెండోసారి వరుసగా హ్యాట్రిక్‌ సాధించాడు. ఇక 2013లో హైదారాబాద్‌ తరఫున ఆడుతూ.. పుణెపై (4/19) చివరిసారి ఆ ఘనత సాధించాడు.
  • ఇక మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే, ఒకే టోర్నీలో యువీ ఇలా రెండుసార్లు హ్యాట్రిక్‌ ప్రదర్శన చేయడం గొప్ప విశేషం. 2009లో పంజాబ్‌ తరపున ఆడిన అతడు తొలుత బెంగళూరుపై (3/22), తర్వాత హైదారాబాద్‌పై (3/13) గణాంకాలు నమోదు చేశాడు.
  • ప్రస్తుత ముంబయి సారథి రోహిత్‌ శర్మది అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కావడం విశేషం. 2009లో హైదారాబాద్ తరఫున ఆడిన అతడు ముంబయిపై ఈ ఘనత సాధించాడు. కేవలం 2 ఓవర్లే బౌలింగ్‌ చేసిన రోహిత్‌ 6 పరుగులిచ్చి మొత్తం 4 వికెట్లు తీశాడు. దీంతో హ్యాట్రిక్‌ వీరుల జాబితాలో మేటి బౌలింగ్‌ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు.
  • రోహిత్‌ తర్వాత అత్యంత మెరుగైన ప్రదర్శన చేసింది సామ్యూల్‌ బద్రీ, సామ్‌ కరణ్‌. 2017లో బెంగళూరు బౌలర్‌గా ఉన్న సామ్యూల్‌ ముంబయిపై హ్యాట్రిక్‌ సాధించి (4/9) గణాంకాలు నమోదు చేశాడు. ఇక 2019లో పంజాబ్‌ తరఫున ఆడిన సామ్‌ కరణ్‌ దిల్లీపై వరుసగా మూడు వికెట్లు తీయడమే కాకుండా (4/11) మెరుగైన బౌలింగ్‌ చేశాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని