T20 World Cup: వార్మప్‌ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్‌

టీ20 ప్రపంచకప్ వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. తన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ నెగ్గింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated : 18 Oct 2021 23:31 IST

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్ వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. తన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ నెగ్గింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఇషాన్‌ కిషన్‌(70: 46 బంతుల్లో), కేఎల్‌ రాహుల్‌ (51: 24 బంతుల్లో) అర్ధశతకాలతో అదరగొట్టారు. తొలి వికెట్‌కు వీరిద్దరు కలిసి 8.2 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం అందించి మంచి పునాది వేశారు. ఈ క్రమంలో మంచి ఊపుమీదున్న రాహుల్‌ మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం వచ్చిన కోహ్లీ 11 పరుగులే చేసి లివింగ్‌ స్టోన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు ధాటిగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌తో జట్టుకట్టిన రిషబ్‌ పంత్‌ (29: 14 బంతుల్లో) నెమ్మదిగా పరుగుల వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ (8) విల్లే బౌలింగ్‌లో జోస్‌ బట్లర్‌కు చిక్కాడు. ఇక భారత్‌కు చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు అవసరం కాగా, ఒక్క ఓవర్లలోనే భారత్‌ 20 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్య(12: 10 బంతుల్లో)తో కలిసి రిషబ్‌పంత్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు.  

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలలో జానీ బెయిర్‌ స్టో (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన మొయిన్‌ అలీ (43) ధాటిగా ఆడాడు. లియామ్‌ లివింగ్‌ స్టోన్ (30) రాణించాడు. జేసన్‌ రాయ్‌ (17), జోస్ బట్లర్‌ (18), డేవిడ్‌ మలన్ (18) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమి మూడు, రాహుల్‌ చాహర్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్‌ తీశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని