
IND vs NZ: జడేజాను నాలుగో స్థానంలో ఆడించాలి: మనోజ్ తివారి
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా నాలుగోస్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఆడించాలని బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్తో టీమ్ఇండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానల్తో మాట్లాడిన అతడు టీమ్ఇండియా ఆటతీరుపై స్పందించాడు. ఈ క్రమంలోనే పాక్తో ఓటమి, తిరిగి పుంజుకునే విషయాలపై తన ఆలోచనలు పంచుకున్నాడు. కోహ్లీసేన బ్యాటింగ్ ఆర్డర్ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, టాప్ఆర్డర్ వైఫల్యమే దాయాదుల పోరులో ఓటమికి కారణమైందని వెల్లడించాడు.
అలాగే టాప్ఆర్డర్లో నలుగురు ఆటగాళ్లు కుడిచేతివాటం గల బ్యాట్స్మెన్ ఉన్నారని, అలా కాకుండా నాలుగో స్థానంలో ఎడమచేతి వాటంగల జడేజాను పంపించాలన్నాడు. అలా చేస్తే బౌలర్లకు ఇబ్బందిగా మారి లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయలేరని చెప్పాడు. అయితే, ఆ స్థానంలో టీమ్ఇండియా.. సూర్యకుమార్ లేదా రిషభ్పంత్ను పంపుతోందని పేర్కొన్నాడు. కానీ, జడేజా ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్నాడన్నాడు. అతడు స్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలు బాదుతూ పరుగులు సాధిస్తాడన్నాడు. అతడిని నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపే ప్రయత్నం చేయాలన్నాడు. టీమ్ఇండియా మంచి అనుభవం కలిగిన జట్టని, ఇకపై ఆడే ప్రతి గేమ్ మంచి రన్రేట్తో గెలవాలని కోరాడు. న్యూజిలాండ్తో పోరులో కోహ్లీ సేన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.