IND vs AUS: ఇదొక సూపర్‌ సిరీస్.. ఆ మ్యాచ్‌ ఫలితంపైనా ఓ కన్నేసి ఉంచాం: ద్రవిడ్

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ దూసుకెళ్లింది. ఈ సందర్భంగా భారత ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్ మాట్లాడాడు.

Published : 13 Mar 2023 19:04 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను (IND vs AUS) టీమ్‌ఇండియా 2-1తేడాతో సొంతం చేసుకుంది. వరుసగా నాలుగో సారి సిరీస్‌ను గెలుచుకోవడం కూడా రికార్డే. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు ఇద్దరు భారత క్రికెటర్లను వరించింది. అవార్డును ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ ఉమ్మడిగా సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్‌ వేదికగాజరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుసగా రెండోసారి చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్‌  విజయం సాధించడమే దీనికి కారణం. ఇదే విషయంపైనా భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కూడా స్పందించాడు. ఆసీస్‌తో నాలుగో టెస్టు ముగిసిన అనంతరం ప్రత్యేకంగా మాట్లాడాడు. 

‘‘చాలా రోజుల తర్వాత తీవ్రమైన పోటీపడిన సిరీస్‌ ఇది. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆటగాళ్లు రాణించారు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన కెప్టెన్‌ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించిన విధాన అద్భుతం. శుభ్‌మన్‌ గిల్‌ తొలి రెండు టెస్టుల్లో బెంచ్‌కే పరిమితమైనప్పటికీ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గత నాలుగైదు నెలలుగా గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి యువ ఆటగాడి ఆటను చూడటం చాలా బాగుంది. నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు కఠినంగా శ్రమిస్తాడు. నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే, న్యూజిలాండ్ - శ్రీలంక మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేదానిపై మేం ఓ కన్నేసి ఉంచాం. ఈ టెస్టు లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆ మ్యాచ్‌ ఫలితం కూడా తేలిపోయింది.  ఆసీస్‌కు అద్భుతమైన ఇద్దరు యువ స్పిన్నర్లు దొరికారు. మర్ఫీ, కునెమన్‌ చాలా చక్కగా బౌలింగ్‌ చేశారు. విదేశీ జట్లకు ఒకేఒక్క నాణ్యమైన స్పిన్నర్‌ను ఇప్పటి వరకు చూస్తూ ఉండేవాళ్లం. కానీ, ఈసారి మాత్రం లయన్‌తోపాటు వారిద్దరూ బాగా వేశారు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి మేం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అయితే తొలుత సిరీస్‌ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటాం’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. 

ఆ సెషన్‌ సవాల్ విసిరింది: గిల్‌ (Shubman Gill)

నాలుగో టెస్టులో ఆసీస్‌పై శుభ్‌మన్‌ గిల్ (128) సెంచరీ సాధించాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. ‘‘నాథన్ లయన్‌ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ప్రతి మ్యాచ్‌లో ఎప్పుడూ అతడి మార్క్‌ ఉంటుంది. మూడో రోజు తొలి సెషన్‌ చాలా సవాల్ విసిరింది. బ్యాటింగ్‌ చేయడానికి రోహిత్, నేనూ శ్రమించాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా లయన్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు క్లిష్టంగా మారింది. బ్యాటర్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల నిలకడగా బంతులను సంధిస్తాడు’’ అని గిల్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని