IND w Vs AUS w: కామన్వెల్త్‌ ఓటమికి.. ఆసీస్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకొనేనా..?

మహిళల టీ20 ప్రపంచ కప్‌ నాకౌట్ దశకు చేరుకొంది. పది జట్లు టైటిల్‌ రేసులో నిలవగా.. చివరికి నాలుగు టీమ్‌లు మాత్రమే సెమీస్‌కు చేరాయి.

Published : 23 Feb 2023 01:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచ కప్‌ నాకౌట్ దశకు చేరుకొంది. పది జట్లు టైటిల్‌ రేసులో నిలవగా.. చివరికి నాలుగు టీమ్‌లు మాత్రమే సెమీస్‌కు చేరాయి. గ్రూప్‌ - A నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా.. గ్రూప్ - B నుంచి ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా సెమీస్‌ బెర్తులను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఇక సెమీస్‌లో ఆసీస్-భారత్, ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. అందులో ఫిబ్రవరి 23న (గురువారం) ఆసీస్‌తో టీమ్ఇండియా తలపడేందుకు సిద్ధమైంది. అయితే, ఆస్ట్రేలియా ఎంత పటిష్టమైన జట్టు అనేది ఇదివరకే భారత్‌కు తెలుసు. మరోసారి అలాంటి టీమ్‌తో తలపడాలంటే సర్వశక్తులూ వడ్డాల్సిందే. 

ఆసీస్‌వన్నీ భారీ విజయాలే.. 

గ్రూప్‌ స్టేజ్‌లో ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌లను ఆడింది. అన్నింట్లోనూ విజయం సాధించింది. అదికూడానూ భారీ విజయాలే సుమా... న్యూజిలాండ్‌పై 97 పరుగుల తేడా, శ్రీలంకపై ఏకంగా పది వికెట్ల తేడాతో విజయం సాధించడం గమనార్హం. లంకనిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 16 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో అలీసా హీలే (146) మూడో స్థానంలో ఉంది. ఇక బౌలింగ్‌ విభాగంలో యాష్ గార్డెనర్ (5/12) అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన ఇచ్చిన బౌలర్‌. అలీ హీలేతోపాటు బెత్‌ మూనీ, కెప్టెన్ మెగ్‌ లానింగ్‌, ఆష్లే గార్డెనర్‌, ఎల్సే పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్‌ వంటి టాప్‌ ప్లేయర్లు ఆ జట్టు సొంతం. పక్కా ప్రొఫెషనల్‌ ప్లేయర్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆసీస్‌ జట్టు ఉంటుంది.

వారిదే హవా.. కానీ.

స్మృతీ మంధాన, హర్మన్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి టాప్‌స్టార్ ప్లేయర్లు భారత్‌కు ఉన్నప్పటికీ.. కీలకమైన సమయంలో చేతులెత్తేయడం ఒక్కోసారి భారత్‌కు వీక్‌నెస్‌గా మారింది. ఆసీస్‌ వంటి బలమైన జట్టుతో ఆడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు 30 టీ20ల్లో ముఖాముఖి తలపడగా.. కేవలం ఏడు మ్యాచుల్లోనే భారత్‌ విజయం సాధించింది. ఆసీస్‌ మాత్రం 22 టీ20ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. చివరిసారిగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది. గత ఐదు మ్యాచ్‌లనే పరిగణనలోకి తీసుకుంటే కేవలం ఒక్క మ్యాచ్‌లోనే టీమ్‌ఇండియా గెలవడం గమనార్హం. 

ఈసారి మాత్రం.. 

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ప్రదర్శన అత్యుత్తమంగానే ఉంది. స్టార్ ఓపెనర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించాలి. ఇప్పటికే స్మృతీ మంధాన మెగా టోర్నీలో వరుసగా మూడు అర్ధశతకాలను నమోదు చేసింది. నాకౌట్‌ స్టేజ్‌లోనూ ఇదే ఊపు కొనసాగించాలి. క్రీజ్‌లో పాతుకుపోతే మాత్రం పరుగులు సాధించవచ్చని ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లనుబట్టి తెలుస్తోంది. బ్యాటింగ్‌లో విఫలమవుతున్న దీప్తి శర్మ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో (ఇంగ్లాండ్‌పై) రిచా ఘోష్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరినప్పటికీ..  అంతకుముందు మంచి ఇన్నింగ్స్‌లే ఆడింది. మరోసారి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు మద్దతుగా నిలిస్తే భారత్‌కు తిరుగుండదు. కామన్వెల్త్ గేమ్స్‌ ఫైనల్‌లో ఓటమికి ఆసీస్‌పై టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తే కనీసం 170 పరుగులను సాధిస్తేనే.. ఆసీస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది. 

మ్యాచ్‌ ఎప్పుడు..: ఫిబ్రవరి 23న గురువారం

వీక్షించేది ఎలా..?: స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానెల్స్‌, డీస్నీ + హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 

ఎన్ని గంటలకు: సాయంత్రం 6.30 గంటలకు.. టాస్‌ 6 గంటలకు..

జట్లు (అంచనాలు): 

భారత్: హర్మన్‌ ప్రీత్‌ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, రిచా ఘోష్‌, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, రాధా యాదవ్‌, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, రేణుకా సింగ్‌

ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్‌ (కెప్టెన్), బెత్ మూనీ, ఎలీసా హీలే, ఆష్లే గార్డెనర్, ఎలీస్ పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్‌, జార్షియా వారెహమ్, అలానా కింగ్‌, మెగన్ స్కట్, డార్సీ బ్రౌన్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని