Virat Kohli: హఠాత్తుగా ముంబయి వెళ్లిన విరాట్‌ కోహ్లీ.. కారణమిదేనా..?

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli).. జట్టు నుంచి బ్రేక్‌ తీసుకుని హఠాత్తుగా ముంబయి వెళ్లాడు. వ్యక్తిగత అత్యవసర కారణాలతో అతడు వెళ్లినట్లు తెలుస్తోంది.

Updated : 02 Oct 2023 14:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచకప్‌ (World Cup 2023) ప్రారంభానికి ముందు తన రెండో వార్మప్‌ మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా (Team India) జట్టు తిరువనంతపురం చేరుకుంది. అయితే స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టుతో కలిసి రాలేదని తెలుస్తోంది. హఠాత్తుగా అతడు ముంబయి వెళ్లినట్లు స్పోర్ట్స్‌ మీడియా సంస్థలు కథనాల్లో వెల్లడించాయి.

తొలి వార్మప్‌ మ్యాచ్‌ రద్దుతో భారత జట్టు.. గువాహటి నుంచి తిరువనంతపురం బయల్దేరింది. అయితే, కోహ్లీ మాత్రం జట్టు యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకుని ముంబయి విమానం ఎక్కినట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ (BCCI) విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. వ్యక్తిగత అత్యవసర కారణాలతో అతడు జట్టును వీడినట్లు సదరు వర్గాలు తెలిపాయి. కోహ్లీ (Virat Kohli).. సోమవారం తిరిగి జట్టుతో చేరనున్నట్లు సమాచారం.

రోహిత్ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టం: పాక్‌ వైస్‌ కెప్టెన్‌

విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) రెండోసారి తల్లికాబోతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. అతడు ముంబయి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వీరిద్దరూ ముంబయిలోని ఓ గైనకాలజీ ఆసుపత్రి వద్ద కన్పించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2017 కోహ్లీ, అనుష్క వివాహం జరగ్గా.. 2021 జనవరిలో వీరికి వామిక జన్మించింది.

ఇక, గువాహటి వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి వార్మప్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ టోర్నీకి ముందు చివరిదైన రెండో వార్మప్‌ మ్యాచ్‌.. మంగళవారం తిరువనంతపురంలో జరగనుంది. నెదర్లాండ్స్‌తో జరిగే ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఇక, ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా అక్టోబరు 8న టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని