IND vs BAN: క్లీన్‌స్వీప్‌ గండం గట్టెక్కేనా..? టీమ్‌ఇండియాని గెలిపించేదెవరు?

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ ఎలాగూ పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడాలని భారత్‌ అభిమానులు కోరుతున్నారు. అయితే కీలక ఆటగాళ్లు బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో రాణిస్తేనే ఇది సాధ్య పడుతుంది. 

Updated : 09 Dec 2022 16:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరుసగా రెండు ఓటములు.. ముగ్గురికి గాయాలు.. బంగ్లాదేశ్‌తో చివరి వన్డేకి ముందు టీమ్‌ఇండియా పరిస్థితి ఇదీ. సిరీస్‌లో నామమాత్రమైన మ్యాచ్‌ అయినప్పటికీ..  టెస్టులకు ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలంటే భారత్‌ తప్పక గెలవాల్సిందే. విజయం చేరువగా వచ్చి బోల్తా పడిన  జట్టును మూడో వన్డేలో గెలిపించే ఆటగాడు ఎవరు? బంగ్లా చేతిలో క్లీన్‌స్వీప్‌ కాకుండా పరువు కాపాడి ‘స్టార్‌’గా మారేది ఎవరు..? అనేది తెలియాలంటే శనివారం మ్యాచ్‌ వరకు ఆగాల్సిందే. ఈలోపు టీమ్‌ఇండియా పరిస్థితి ఎలా ఉందో ఓ సారి పరిశీలిద్దాం.. 

బ్యాటింగ్‌, బౌలింగ్‌ గురించి ఎలా మాట్లాడుకోవాలో కూడా తెలియని పరిస్థితి. బ్యాటింగ్‌ సంగతికొస్తే ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతా వారు రాణించిందేమీ లేదు. రోహిత్ శర్మ గాయంబారిన పడటంతో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ గెలుపు బాధ్యత తీసుకోవాలి. కెప్టెన్‌గా వ్యవహరించే కేఎల్ రాహుల్ జట్టు విజయం కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. శ్రేయస్‌ తన ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చివరి వన్డేలో బ్యాటర్లు బాధ్యతతో గెలిపించాలి. అలాగే భారత బౌలర్లు ఇటు బ్యాటింగ్‌లోనూ కాస్త తమ సహకారం అందించాలి. రెండో వన్డేలో సిరాజ్ సింగిల్‌ తీయడానికే ఇబ్బంది పడాడ్డు. కీలకమైన సమయంలో రెండు ఓవర్లలో ఒక్క పరుగే రావడంతో రోహిత్ పోరాటం వృథా అయింది.

ఇంకా టీ20 ఫార్మాట్‌లోనే.. 

బౌలింగ్‌ గురించి చెప్పాల్సి వస్తే మనోళ్లు ఇంకా టీ20 ఫార్మాట్‌ నుంచి బయటపడినట్లు లేదు. తొలి 20 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్‌ వేస్తున్నారు. ప్రత్యర్థి జట్టుకు చెందిన ఐదారు వికెట్లను టపాటపా తీసేస్తారు. అయితే అక్కడ నుంచి పట్టు వదిలేస్తున్నారు. తొలి రెండు వన్డేల్లోనూ ఇలాగే జరిగింది. మొదటి వన్డేలో చివరి వికెట్‌ తీయడానికి నానా తంటాలు పడిన బౌలర్లు.. ఇక రెండో వన్డేలో అయితే ఏడో స్థానంలో వచ్చిన మెహిదీ హసన్ మిరాజ్‌తో సెంచరీ కొట్టించారు. ప్రత్యర్థి ‘తోక’ను కత్తిరించడంలో ఏమాత్రం తడబాటుకు గురి కాకుండా బౌలర్లు రాణించాలి. అలాగే  ఫీల్డింగ్‌లోనూ తొలి వన్డే మాదిరిగా కాకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. 

20 నుంచి 14కి.. 

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు దాదాపు భారత్‌కు 20 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండేవారు. అందులో 15 మందితో కూడిన స్క్వాడ్‌ను మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌, రిషభ్‌ పంత్‌కు ముందే విశ్రాంతి ఇచ్చారు. తొలి వన్డేకు దూరమైన అక్షర్ పటేల్ రెండో మ్యాచ్‌ ఆడాడు. అయితే మూడో వన్డే నాటికి రోహిత్, దీపక్ చాహర్, కుల్దీప్‌ సేన్ గాయాలబారిన పడి వైదొలిగారు. దీంతో కుల్దీప్‌ యాదవ్ జట్టుతో చేరాడు. తుది జట్టులో యువ ఆటగాళ్లు రజత్, రాహుల్ త్రిపాఠి, షహబాజ్‌ అహ్మద్‌లో ఎవరికి చోటు దక్కేనో..?

భారత జట్టు ఇదే: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, షహబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్‌దీప్‌ యాదవ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని