IND vs NZ: ‘వంద’ కోసం చెమటోడ్చిన టీమ్‌ఇండియా.. రెండో టీ20లో విజయం

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ రేసులో (IND vs NZ) భారత్‌ నిలిచింది. కీలకమైన రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది.

Updated : 29 Jan 2023 23:13 IST

లఖ్‌నవూ: లక్ష్యం వంద పరుగులు.. భారత బ్యాటింగ్‌ లైనప్‌ను చూస్తే అవలీలగా కొట్టేస్తారని అనిపించింది. కానీ మ్యాచ్ చివరి ఓవర్‌ వరకూ వెళ్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మ్యాచ్‌లో అత్యధికంగా 30 ఓవర్లు స్పిన్నర్లే వేస్తే ఎలా ఉంటుందంటే.. దానికి ప్రత్యక్ష ఉదాహరణ భారత్‌ - కివీస్‌ రెండో టీ20.. అయితే చివరికి వంద పరుగుల లక్ష్య ఛేదనను చెమటోడ్చి పూర్తి చేసి భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 99/8 స్కోరు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి గెలిచింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

కెప్టెనే అక్కడ టాప్‌ స్కోరర్..

టాస్‌ నెగ్గిన కివీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొంది. అయితే పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్‌ను 99/8 స్కోరుకే పరిమితం చేశారు. ఆ జట్టులో మిచెల్ శాంట్నర్ (19) టాప్‌ స్కోరర్‌. మిగతా వారిలో ఫిన్‌ అలెన్ 11, డేవన్ కాన్వే 11, చాప్‌మన్ 14, బ్రాస్‌వెల్‌ 14 పరుగులు సాధించారు. భారత్‌ నుంచి ఏడుగురు బౌలర్లు బౌలింగ్‌ చేయగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌కు (2/7) ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌ను, మావికి 19వ ఓవర్‌ను హార్దిక్‌ ఇచ్చాడు. అర్ష్‌దీప్‌ 2 వికెట్లు తీయగా.. హార్దిక్‌, సుందర్, చాహల్, దీపక్‌, కుల్‌దీప్‌ తలో వికెట్ తీశారు.

సూర్య చివర్లో..

టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి బ్యాటింగ్‌ ఎంచుకొన్న తర్వాత ఓ మాట చెప్పాడు. లక్ష్య ఛేదన చాలా కష్టంగా ఉంటుంది అందుకే మొదట బ్యాటింగ్‌ తీసుకున్నానని తెలిపాడు. లఖ్‌నవూ పిచ్‌ అక్షరాలా అలాగే సాగింది. వంద పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ సజావుగా సాగలేదు. ప్రత్యర్థి బౌలర్లు ఊరించే విధంగా బంతులను సంధించి మరీ భారత వికెట్లను రాబట్టారు. అయితే ఇందులో రెండు వికెట్లు రనౌట్‌ రూపంలోనే కివీస్‌కి దక్కాయి. ఇక చివర్లో సూర్యకుమార్ (26*), హార్దిక్‌ పాండ్య (15*) ఐదో వికెట్‌కు 29 పరుగులు జోడించి మరీ జట్టును విజయతీరాలకు చేర్చారు. శుభ్‌మన్‌ గిల్ 11, ఇషాన్‌ కిషన్ 19, రాహుల్‌ త్రిపాఠి 13, వాషింగ్టన్‌ సుందర్ 10 పరుగులు సాధించారు.

‘వంద’ను కాపాడుకొనేందుకు..

భారత్‌కు నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొనేందుకు కివీస్‌ ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించింది. చివరి ఓవర్‌ వరకూ సక్సెస్‌ అయినప్పటికీ.. సూర్య కుమార్‌ భారత్‌ను గెలిపించాడు. మూడు ఓవర్లు మినహా 17 ఓవర్లను స్పిన్నర్లే వేయడం గమనార్హం. ఇలా అత్యధికంగా స్పిన్నర్లతో బౌలింగ్‌ వేయించిన మూడో జట్టుగా న్యూజిలాండ్‌ నిలిచింది. అందులోనూ గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్ వంటి పార్ట్‌టైమ్‌ బౌలర్లతో బౌలింగ్‌ చేయించాడు ఆ జట్టు సారథి మిచెల్ శాంట్నర్. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే.. కివీస్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఒక్క సిక్సర్‌ కొట్టని ఆ జట్టు.. భారత్‌ ఇన్నింగ్స్‌లోనూ ఎవరితోనూ సిక్స్‌ కొట్టనీయకుండా బౌలింగ్‌ చేయడం గమనార్హం. ఇలా ఇరు ఇన్నింగ్స్‌ల్లో ఆడిన 239 బంతుల్లో ఒక్క సిక్స్‌ లేకుండా మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని