2007 T20 World Cup: క్రికెట్ చాణక్యుడు ధోనీ కెప్టెన్సీకి అసలైన నిర్వచనం ఈ విజయం

టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియా తొలి విశ్వవిజేత. సీనియర్లు లేని భారత జట్టు మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలో 2007 సెప్టెంబర్‌ 24న ఈ ఘనత సాధించింది...

Published : 25 Sep 2021 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియా తొలి విశ్వవిజేత. సీనియర్లు లేని భారత జట్టు మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలో ఈ ఘనత సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చారిత్రక విజయం నమోదు చేసి సగటు భారత క్రికెట్‌ అభిమాని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. 14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు టీమ్‌ఇండియా ఆ అపురూప విజయం సాధించింది. ఇంకా ఆ మధుర స్మృతులు అభిమానుల కళ్లల్లో కదలాడుతున్నాయి. నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల్లో జోగిందర్‌ శర్మ వేసిన ఆ చివరి ఓవర్‌.. మిస్బా ఆడిన స్కూప్‌ షాట్‌ను అనూహ్యంగా క్యాచ్‌ అందుకున్న శ్రీశాంత్‌.. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్‌ ధోనీని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈ విజయం సమష్టి కృషికి నిదర్శనం, అసలైన సారథ్యానికి నిలువుటద్దం.

కెప్టెన్సీలో అపర చాణక్యుడు..

పాకిస్థాన్‌ విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమైన వేళ అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఒక్క వికెట్‌ తీస్తే భారత్‌ విజయం. రెండు సిక్సులు కొడితే పాకిస్థాన్‌ గెలుపు. ఇద్దరికీ సమాన అవకాశాలు. దీంతో రెండు దేశాల క్రికెట్ అభిమానులు కళ్లార్పకుండా మ్యాచ్‌ను తిలకిస్తున్నారు. అలాంటి సమయంలోనూ భారత కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. బంతిని యువ పేసర్‌ జోగిందర్‌ శర్మకు అప్పగించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే జోగిందర్‌ వేసిన తొలి బంతి వైడ్‌గా వెళ్లింది. తర్వాతి బంతి డాట్‌బాల్‌. ఇక మూడో బంతిని మిస్బా (43; 38 బంతుల్లో 4x6) సిక్స్‌గా మలవడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సమీకరణం నాలుగు బంతుల్లో 6 పరుగులుగా మారింది. అంతా ధోనీ నిర్ణయం సరైంది కాదనుకున్నారు. అదే సమయంలో జోగిందర్‌ వద్దకెళ్లి ఏదో మాట్లాడాడు. తర్వాత అతడు వేసిన నాలుగో బంతి ఆఫ్‌స్టంప్‌కు ఆవల రావడంతో మిస్బా రివర్స్‌ స్కూప్‌ ఆడాడు. బంతి గాల్లోకి లేవగా అందరి కళ్లూ దానిపైనే ఉన్నాయి. ఊపిరి బిగబట్టి చూస్తుండగా బంతిని శ్రీశాంత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. భారత్‌ గెలిచింది. అభిమానులు మురిశారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కానీ ఆ జ్ఞపకాలు ఇంకా అభిమానుల గుండెల్లో పదిలంగా ఉన్నాయి.

చివర్లో రోహిత్‌ ధనాధన్‌..

అంతకుముందు టీమ్‌ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసింది. నిర్ణిత ఓవర్లలో 157/5 స్కోర్‌ సాధించింది. ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (75; 54 బంతుల్లో  8x4, 2x6) టాప్‌ స్కోరర్‌గా నిలవగా చివర్లో రోహిత్‌ శర్మ (30; 16 బంతుల్లో 2x4, 1x6) ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు మంచి స్కోర్‌ అందించాడు. ఛేదనలో పాక్‌ తడబడినా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మిస్బా భారత్‌కు చెమటలు పట్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సిక్సర్లతో చెలరేగాడు. చివరి వరకూ క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌ను గెలిపించేలా కనిపించాడు. కానీ.. ధోనీ చాణక్యానికి, జోగిందర్‌ బౌలింగ్‌కు, శ్రీశాంత్‌ క్యాచ్‌కు దొరికిపోయి నిరాశతో వెనుదిరిగాడు. దీంతో పాకిస్థాన్‌ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. టీమ్‌ఇండియా బౌలర్లలో ఇర్ఫాన్‌, ఆర్పీ సింగ్‌ మూడేసి వికెట్లు తీయగా జోగిందర్‌ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని