
Amarinder Singh: పంజాబ్ సీఎం వండి.. అతిథులకు ఆయనే వడ్డించి
చండీగఢ్: ప్రభుత్వ పాలన, రాజకీయాలతో ఎప్పుడూ తీరిక లేకుండా గడిపే పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ బుధవారం గరిటె పట్టుకున్నారు. ఆయనే స్వయంగా వంట చేశారు. అతిథులకు ఆయనే వడ్డించారు. ఇంతకీ ఈ సీఏం అంత ప్రత్యేకంగా వంట చేసి వడ్డించింది ఎవరికీ అనుకుంటున్నారా? పంజాబ్ నుంచి ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన, ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్ల కోసమే అమరిందర్ ఇలా వంటలు చేశారు. మొహాలీలోని తన ఫాంహౌస్లో అథ్లెట్లకు సీఎం విందు ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన పురుష, మహిళా హాకీ ప్లేయర్లు, ఇతర అథ్లెట్లు ఈ విందులో పాల్గొన్నారు. ఒలింపిక్స్లో పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలవగా.. మహిళల జట్టు తృటిలో పతకానికి దూరమైన సంగతి తెలిసిందే. ‘‘ఉదయం 11 గంటలకు వంట చేయడం మొదలెడితే సాయంత్రం 5 వరకూ కొనసాగింది. ఈ ప్రతి నిమిషాన్ని ఆస్వాదించా. దేశానికి కీర్తి తేవడం కోసం అథ్లెట్లు ఎంతో శ్రమిస్తారు. దాని ముందు నేను చేసింది చాలా తక్కువే’’ అని అమరిందర్ తెలిపారు. మటన్ మసాలా, చికెన్, ఆలు కుర్మా, కోడి కుర్మా, బిర్యానీ, జర్దా రైస్ లాంటి నోరూరించే వంటకాలను అథ్లెట్ల కోసం సిద్ధం చేయడం విశేషం.