IPL 2021: నాలాంటి ముసలోడు నిత్యనూతనంగా ఉండాలి: డివిలియర్స్

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ‘ముసలోడని’ తనని తానే సంబోధించుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌ కోసం యూఏఈలో

Updated : 14 Sep 2021 10:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా మాజీ సారథి, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తనని తాను ముసలోడుగా సంబోధించుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌ కోసం యూఏఈలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన అతడు తన ఆట గురించి మాట్లాడుతూ ఇలా పేర్కొన్నాడు. చెమటోడ్చి కష్టపడటం వల్ల కాస్త బరువు తగ్గే అవకాశముందని.. తనలాంటి ముసలోడు వీలైనంత మేర ఆటలో పోటీపడేందుకు నిత్యనూతనంగా ఉండాలని చెప్పాడు.

‘ఈ ప్రాక్టీస్‌ సెషన్‌ గొప్పగా జరిగింది. మళ్లీ ఈ క్యాంప్‌లో అందర్నీ కలవడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సీజన్‌ ప్రారంభం కోసమే ఎదురుచూస్తున్నారు. నేనైతే రేపటి ప్రాక్టీస్‌ కోసం ఆసక్తిగా ఉన్నా. ఇప్పటివరకు మా జట్టులో కొంతమంది వచ్చారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. అయితే, వచ్చిన వారితో మాట్లాడి ఇన్ని రోజులు ఏం చేశారో తెలుసుకున్నా. కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలిశాయి’ అని  డివిలియర్స్‌ వివరించాడు. కాగా, ఈ సెషన్‌లో డివిలియర్స్‌ ప్రాక్టీస్‌ అదిరిపోయింది. బంతిని మైదానం నలువైపులా ఆడుతూ రాబోయే సీజన్‌లో అదరగొట్టేలా కనిపించాడు. మరి సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభమయ్యే 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో ఏబీ ఎలా ఆడతాడో చూడాలి. ఇక సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోయేసరికి బెంగళూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి 10 పాయింట్లతో కొనసాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని