Anil Kumble: సాంకేతికత పెరుగుతోంది.. క్రీడల్లో ఓటీటీలు వస్తాయి: కుంబ్లే

ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత భారీగా పెరుగుతుందని, తద్వారా క్రికెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే అన్నారు. భవిష్యత్లో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) విధానంలో మరిన్ని మార్పులు...

Published : 14 Sep 2021 01:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత భారీగా పెరుగుతుందని, తద్వారా క్రికెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే అన్నారు. భవిష్యత్లో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) విధానంలో మరిన్ని మార్పులు సంభవిస్తాయన్నారు. అదే జరిగితే ఏ క్రీడాకారుడూ ‘డేటా ఇంటిలిజెన్స్‌’ను కొట్టిపారేయలేడని కుంబ్లే పేర్కొన్నారు. ఓ యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ‘బిల్డింగ్‌ కాంపిటిటివ్‌ అడ్వాంటేజ్‌ త్రూ స్పోర్ట్స్‌ అనలిటిక్స్‌ అండ్‌ డేటా ఇంటెలిజెన్స్‌’ అనే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ స్పిన్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌లో ఇప్పటికే డీఆర్‌ఎస్‌ విధానం అమలు చేస్తున్నారని, అది ఆటపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. ఈ టెక్నాలజీ మున్ముందు మరింత కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఆటగాళ్లు ఈ మార్పులను ఆహ్వానిస్తే బాగుంటుందని లేకపోతే వెనుకపడిపోతారని ఆయన పేర్కొన్నారు.

క్రికెట్‌లో సాంకేతికత అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా అది ఆటకు మంచి చేస్తుందని, అందుకే అది ఆహ్వానించదగ్గ విషయమని తెలిపారు. ఈ క్రమంలోనే క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయని పేర్కొన్నారు. ఇకపై టీవీలు, ప్రసారదారుల ప్రభావం అధికంగా ఉండదన్నారు. క్రీడా సమాఖ్యలు సైతం ప్రజలకు చేరువ అయ్యేందుకు సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటారని అభిప్రాయపడ్డారు. ఆటలను ప్రజలకు చేరువ చేసేందుకు ఇన్ని రోజులు టీవీలు ఆ పాత్ర పోషించాయని, ఇకపై ఓటీటీలు వస్తాయని కుంబ్లే వివరించారు. ఈ మార్పుల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు క్రికెట్‌లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లు పెరిగేకొద్దీ ‘డేటా ఇంటిలిజెన్స్‌’ అధికమవుతుందని అంచనా వేశారు. ఆటలు ఎంత చిన్నగా మారితే డేటా ఇంటిలెజెన్స్ వినియోగం అంత ఎక్కువగా ఉంటుందని కుంబ్లే వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని