Arun Dhumal on IPL: 8 జట్లతో ఇదే ఆఖరి సీజన్‌.. వచ్చేసారి 10 జట్లు  ఖాయం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశకు అభిమానులను అనుమతించేందుకు కృషి చేస్తున్నామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌ అన్నారు....

Published : 19 Aug 2021 01:26 IST

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశకు అభిమానులను అనుమతించేందుకు కృషి చేస్తున్నామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌ తెలిపారు. ఇందుకు యూఏఈ ప్రభుత్వ అనుమతి అవసరమన్నారు. ఎనిమిది జట్లతో లీగ్‌ ఆడటం ఇదే ఆఖరి సారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే సీజన్‌ నుంచి 10 జట్లు పోటీలో ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్‌ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

‘ఐపీఎల్‌ రెండో దశకు అభిమానులను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజలు టీకాలు వేయించుకోవడంతో యూఏఈ ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి! ఒకవేళ అనుమతిస్తే అటు ఆటగాళ్లు, ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారి భద్రతే అత్యంత ముఖ్యం. మిగతాదంతా యూఏఈ ప్రభుత్వంపై ఆధారపడి ఉంది’ అని అరుణ్ ధుమాల్‌ అన్నారు.

పది జట్ల ఐపీఎల్‌ గురించీ ధుమాల్‌ మాట్లాడారు. ‘ఇప్పుడందరి చూపూ ఐపీఎల్‌ మీదే ఉంది. యూఏఈలో ఐపీఎల్‌ విజయవంతం అవుతుందని నమ్ముతున్నాం. ఏదేమైనా ఎనిమిది జట్లతో ఇదే చివరి సీజన్‌. వచ్చేసారి 10 జట్లు ఉంటాయి. మేం దానిపైనా పనిచేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. గతంలోనూ లీగ్‌లో పది జట్లు ఉన్న సంగతి తెలిసిందే. 2011లో 10 జట్లతో లీగ్‌ నిర్వహించారు. 2012, 13లో తొమ్మిది జట్లు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ ఎనిమిది జట్లకు పరిమితమైంది. ఈ ఏడాది డిసెంబర్లో భారీ వేలం ఉండొచ్చని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని