IPL 2021: అది షాక్‌కు గురిచేసింది.. ఐపీఎల్‌లో ఇలాంటివి జరగొద్దు: గంభీర్‌

పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. శుక్రవారం రాత్రి కోల్‌కతాతో తలపడిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే...

Published : 03 Oct 2021 01:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. శుక్రవారం రాత్రి కోల్‌కతాతో తలపడిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (67; 55 బంతుల్లో 4x4, 2x6) చివరి వరకూ పోరాడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, 19వ ఓవర్‌లో అతడు కీలక సమయంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శివమ్‌ మావీ వేసిన 18.3 ఓవర్‌కు పంజాబ్‌ కెప్టెన్‌ భారీ షాట్‌ ఆడగా రాహుల్‌ త్రిపాఠి పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు.

ఆ క్యాచ్‌పై అంపైర్లకు స్పష్టత లేకపోవడంతో థర్డ్‌ అంపైర్‌కు నివేదించారు. అక్కడ పలుమార్లు రీప్లేలో చూసి చివరికి కేఎల్‌ రాహుల్‌ నాటౌట్‌ అని తేల్చారు. దీనిపై కోల్‌కతా మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ విస్మయం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు జట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నాడు. ‘ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటివి ఒక జట్టు ప్రయాణాన్ని ముగిస్తాయి. రాహుల్‌ చాలా క్లియర్‌గా ఔటయ్యాడు. థర్డ్‌ అంపైర్‌ రీప్లే ఒక్కసారికి మించి కూడా చూడాల్సిన అవసరం లేదు. స్లో మోషన్‌ లేకుండానే ఔటైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఔట్‌ ఇచ్చి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. పంజాబ్‌ చివరి ఓవర్లలో బోల్తా కొట్టడం మనం ఇదివరకే చూశాం. ఐపీఎల్‌లాంటి మెగా ఈవెంట్లలో ఇలాంటి తప్పులు జరగకూడదు. ఇది ఒక ఆటగాడికే కాకుండా జట్టు మొత్తంపైనా ప్రభావం చూపుతుంది’ అని గంభీర్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని