IND vs ENG: ఐదో టెస్టుపై స్పష్టత.. బీసీసీఐ ఏం చెప్పిందంటే

ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టుపై స్పష్టత వచ్చింది. భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో ఇరు బోర్డులూ ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ చెప్పింది. అయితే, త్వరలోనే ఈ మ్యాచ్‌ను తిరిగి నిర్వహించేందుకు ఇంగ్లాండ్‌...

Published : 11 Sep 2021 02:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టుపై స్పష్టత వచ్చింది. భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో ఇరు బోర్డులూ ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ చెప్పింది. అయితే, త్వరలోనే ఈ మ్యాచ్‌ను తిరిగి నిర్వహించేందుకు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు బోర్డుల పరస్పర అంగీకారంతో నేడు జరగాల్సిన ఐదో టెస్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని భావించాయని, అయితే.. ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో చర్చల అనంతరం రద్దు చేయడానికి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించారు.

అయితే, ఐదో టెస్టును త్వరలోనే మళ్లీ నిర్వహించేందుకు ఈసీబీ(ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు)తో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ కష్టసమయాల్లో తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించినందుకు ఈసీబీకి జైషా ధన్యవాదాలు చెప్పాడు. మరోవైపు ఐదో టెస్ట్‌ రద్దవ్వడంపై పలువురు మాజీలు, క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేశారు. టీమ్‌ఇండియా ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్నందున చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఇంగ్లాండ్‌ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌ రద్దుపై తొలుత ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు గందరగోళమైన ప్రకటన చేసింది. ఈ టెస్టులో టీమ్‌ఇండియా తమ తుది జట్టును బరిలోకి దింపలేకపోతున్నందున మ్యాచ్‌ను కోల్పోయిందని పేర్కొంది. తర్వాత ఈ వ్యాఖ్యలను సరిచేసుకొని ఐదో టెస్టు రద్దయినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ప్రకటనతో పూర్తి స్పష్టత వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని