IND vs ENG: భారత్‌ను చుట్టేసిన ఇంగ్లాండ్‌..  తొలి ఇన్నింగ్స్‌లో 191కు ఆలౌట్‌

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తక్కువ స్కోర్‌ సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఇంగ్లాండ్‌ బౌలర్లు మరోసారి చుట్టిపడేశారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 191 పరుగులకు ఆలౌటైంది...

Updated : 02 Sep 2021 22:10 IST

లండన్‌: నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఇంగ్లాండ్‌ బౌలర్లు మరోసారి చుట్టిపడేశారు. దీంతో టీమ్‌ఇండియా 191 పరుగులకే ఆలౌటైంది. ఆల్‌రౌండర్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ (57; 36 బంతుల్లో 7x4, 3x6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (50; 96 బంతుల్లో 8x4) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులెత్తేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌వోక్స్‌ నాలుగు, రాబిన్‌సన్‌ మూడు వికెట్లు తీయగా అండర్సన్‌, ఓవర్టన్‌ చెరో వికెట్‌ తీశారు.

నిరాశపర్చిన టాప్‌ఆర్డర్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. మ్యాచ్‌ ప్రారంభమైన గంటకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. తొలుత క్రిస్‌వోక్స్‌ రోహిత్‌ శర్మ(11)ను ఔట్‌ చేయగా తర్వాత రాబిన్‌సన్‌.. కేఎల్‌ రాహుల్‌(17)ను వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే అండర్సన్‌.. చెతేశ్వర్‌ పుజారా(4)ను సైతం పెవిలియన్‌ చేర్చి భారత్‌ను గట్టి దెబ్బతీశాడు. దాంతో టీమ్‌ఇండియా 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై కోహ్లీ, రవీంద్ర జడేజా(10) మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు.

దూకుడుగా ఆడిన శార్ధూల్‌..

అయితే, భోజన విరామం తర్వాత మరింత చెలరేగిన ఇంగ్లాండ్‌ పేసర్లు ఈసారి జడేజా, కోహ్లీ, రహానెను పెవిలియన్‌ పంపారు. ఐదో ఆటగాడిగా బరిలోకి దిగిన జడేజా బాగా ఆడతాడనుకున్నా విఫలమయ్యాడు. వోక్స్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రూట్‌ చేతికి చిక్కాడు. అనంతరం కోహ్లీ అర్ధశతకం పూర్తిచేసుకొని రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో కీపర్‌కు చిక్కాడు. దాంతో భారత్‌ 105 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం ఓవర్టన్‌ బౌలింగ్‌లో రహానె(14), వోక్స్‌ బౌలింగ్‌లో పంత్‌(9) కూడా విఫలమయ్యారు. ఇక మూడో సెషన్‌లో ధాటిగా ఆడిన శార్ధూల్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఉమేశ్‌ యాదవ్‌(10)తో కలిసి ఎనిమిది వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. అయితే, జట్టు స్కోర్‌ 190 పరుగుల వద్ద అతడు క్రిస్‌వోక్స్‌ ఔలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో భారత్‌ తర్వాతి రెండు వికెట్లు మరుసటి ఓవర్‌లోనే కోల్పోయింది. రాబిన్‌సన్‌ వేసిన 62వ ఓవర్‌లో బుమ్రా(0), ఉమేశ్‌ ఔటవ్వడంతో తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని