IND vs ENG: మూడో రోజు టీమ్‌ఇండియాదే.. భారీ స్కోర్‌పైనే గురి

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి 270/3 స్కోర్‌తో నిలిచి 171 పరుగుల ఆధిక్యం సాధించింది...

Updated : 05 Sep 2021 07:07 IST

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి 270/3 స్కోర్‌తో నిలిచి 171 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(22; 37 బంతుల్లో 4x4), రవీంద్ర జడేజా (9; 33 బంతుల్లో 2x4) నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (127; 256 బంతుల్లో 14x4, 1x6) శతకంతో మెరవగా పుజారా (61; 127 బంతుల్లో 6x4) అర్ధ శతకంతో రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 153 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి మూడోరోజు భారత్‌ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

అద్భుతంగా ఆడుతున్న వీరిని రాబిన్‌సన్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్ పంపి భారత్‌కు గట్టి షాక్‌ ఇచ్చాడు. 81వ ఓవర్‌లో తొలుత పుల్‌షాట్‌ ఆడిన రోహిత్‌.. క్రిస్‌వోక్స్‌ చేతికి చిక్కగా చివరి బంతికి పుజారా అనూహ్య బంతికి మొయిన్‌ అలీ చేతికి చిక్కాడు. దాంతో టీమ్‌ఇండియా ఒక్క పరుగు వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం కోహ్లీ, జడేజా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు. ఇక నాలుగో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్‌ సాధించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడ్డాయి.

ఇక 55/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన రోహిత్, రాహుల్‌(46; 101 బంతుల్లో 6x4, 1x6) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరూ టీమ్‌ఇండియా భారీ స్కోర్‌ సాధించడానికి గట్టి పునాదులు వేశారు. అయితే, చక్కగా ఆడుతున్న వీరిని అండర్సన్‌ విడదీశాడు. 34వ ఓవర్‌ చివరి బంతికి రాహుల్‌ను బోల్తా కొట్టించాడు. ఆపై క్రీజులోకి వచ్చిన పుజారా.. రోహిత్‌తో కలిసి నిలకడగా ఆడాడు. వీరిద్దరూ రెండో సెషన్‌లో ఒక్క వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. అంతకుముందే రోహిత్‌.. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు. ఇది అతడి కెరీర్‌లో విదేశీ గడ్డపై తొలి టెస్టు సెంచరీ కావడం కూడా గమనార్హం. ఆపై మూడో సెషన్‌లో పుజారా అర్ధశతకం సాధించాడు. దీంతో మరింత ప్రమాదకరంగా మారిన వీరిని రాబిన్‌సన్‌ ఓవర్‌లో ఔట్‌ చేశాడు. చివరికి కోహ్లీ, జడేజా బ్యాటింగ్‌ చేస్తూ మూడో రోజు ఆటను ముగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని