IND vs NZ: రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ మరో 27...

Updated : 07 Dec 2021 14:10 IST

1-0 తేడాతో భారత్‌ సిరీస్‌ కైవసం..

ముంబయి: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది. సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్‌ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోల్స్‌ (44) పరుగులతో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 1-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా, టెస్టుల్లో పరుగల పరంగా భారత్‌కిది అత్యంత భారీ విజయం.

టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అజాజ్‌ పటేల్‌ 10/119 చారిత్రక బౌలింగ్‌ ప్రదర్శన చేసినా.. మయాంక్‌ అగర్వాల్‌ (150; 311 బంతుల్లో 17x4, 4x6), అక్షర్‌ పటేల్‌ (52; 128 బంతుల్లో 5x4, 1x6) కీలక పరుగులు చేశారు. అనంతరం న్యూజిలాండ్‌ బరిలోకి దిగి 62 పరుగులకే కుప్పకూలింది. ఇది భారత్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్‌. సిరాజ్‌ 3/19 టాప్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టగా తర్వాత అశ్విన్‌ 4/8, అక్షర్‌ 2/14 మిగతా ఆటగాళ్ల పనిపట్టారు. దీంతో భారత్‌కు 263 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.

ఫాలోఆన్‌ కాదని..

రెండో రోజు ఆటలో న్యూజిలాండ్‌ స్వల్ప స్కోరుకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడినా.. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ చేసేందుకే మొగ్గుచూపింది. ఈ క్రమంలోనే మయాంక్‌ (62; 108 బంతుల్లో 9x4, 1x6), పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) తొలి వికెట్‌కు శతక (107) భాగస్వామ్యం జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అజాజ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యారు. తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ (47; 75 బంతుల్లో 4x4, 1x6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (36; 84 బంతుల్లో 1x4, 1x6) రాణించారు. అయితే, వీరిని రచిన్‌ రవీంద్ర ఔట్‌చేయగా తర్వాత వచ్చిన శ్రేయస్‌ (14), సాహా(13) విఫలమయ్యారు. చివర్లో అక్షర్‌ పటేల్‌ (41; 26 బంతుల్లో 3x4, 4x6) ధాటిగా ఆడి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు 276/7 స్కోర్‌ అందించాడు.

ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసి..

మూడో రోజు ఆటలో జయంత్‌ యాదవ్‌(6) ఏడో వికెట్‌గా వెనుదిరిగాక కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేశాడు. దీంతో న్యూజిలాండ్‌ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్‌ఇండియా. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ మూడో రోజు ఆటనిలిచిపోయేసరికి 140/5తో నిలిచింది. అశ్విన్‌ మరోసారి చెలరేగడంతో ఆదివారమే న్యూజిలాండ్‌ సగం పని అయిపోయింది. డారిల్‌ మిచెల్‌ (60; 92 బంతుల్లో 7x4, 2x6), హెన్రీ నికోల్స్‌ (44; 111 బంతుల్లో 8x4) కాస్త ప్రతిఘటించడంతో ఆట నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ విజృంభించి గంటలోనే మ్యాచ్‌ను పూర్తి చేశాడు.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మయాంక్‌ అగర్వాల్‌ కాగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌: అశ్విన్‌ ఎంపికయ్యారు.

స్కోర్‌బోర్డు:

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 325 ఆలౌట్‌; అజాజ్‌ పటేల్‌ 10 వికెట్లు

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 62 ఆలౌట్‌; అశ్విన్‌ 4 వికెట్లు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 276/7 డిక్లేర్డ్‌; అజాజ్‌ 4 వికెట్లు

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 167 ఆలౌట్‌; అశ్విన్‌, జయంత్‌ 4 వికెట్లు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని