Nandu Natekar: బ్యాడ్మింటన్‌ దిగ్గజం నందు నటేకర్‌ కన్నుమూత

భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం నందు నటేకర్‌ (88) ఇక లేరు. వృద్ధాప్య కారణాలతో బుధవారం ఆయన సహజ మరణం చెందారు. మూడు నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు...

Published : 28 Jul 2021 12:49 IST

ముంబయి: భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం నందు నటేకర్‌ (88) ఇక లేరు. వృద్ధాప్య కారణాలతో బుధవారం ఆయన సహజ మరణం చెందారు. మూడు నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

నందు నటేకర్‌ను దేశ తొలితరం బ్యాడ్మింటన్‌ దిగ్గజమని చెప్పడంలో ఎవరికీ సందేహం లేదు. 1956లో అంతర్జాతీయ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయుడు ఆయనే కావడం ప్రత్యేకం. కెరీర్లో ఆయన 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఆయనకు ఒక కుమారుడు గౌరవ్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

‘ఆయన (నందు నటేకర్‌) ఇంట్లోనే సహజ మరణం చెందారు. మేమంతా ఆయన వెంటే ఉన్నాం. మూడు నెలలుగా ఆయన కాస్త నలతగా ఉంటున్నారు. మేమెంతగానో ప్రేమించే మా నాన్న నందు నటేకర్‌ 2021, జులై 28న కన్నుమూశారని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాం. కొవిడ్‌ నిబంధనల కారణంగా మేం ఎలాంటి సంతాప కార్యక్రమం ఏర్పాటు చేయడం లేదు. మీరంతా ఆయనను మనసులోనే స్మరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని నటేకర్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

మహారాష్ట్ర సంగ్లిలో జన్మించిన నటేకర్‌ భారత క్రీడారంగంలో తనదైన ముద్ర వేశారు. 1961లో ఆయన అర్జున అవార్డు అందుకున్నారు. 1954 ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు. 1956లో మలేసియాలో సెలాంజర్‌ ఇంటర్నేషనల్‌ సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. 1951-1963 మధ్య థామస్‌కప్‌లో భారత జట్టు తరఫున 16 సింగిల్స్‌లో 12, 16 డబుల్స్‌లో 8 గెలిచారు. 1959, 1961, 1963లో జట్టును నడిపించారు. 1965 కామన్వెల్త్‌ క్రీడల్లోనూ ఆయన పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని