Tokyo Olympics: భారత్‌కు మరో పతకం ఖాయం.. సెమీస్‌కు లవ్లీనా 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ క్వార్టర్స్‌లో

Updated : 30 Jul 2021 11:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఈ అస్సాం అమ్మాయి.. సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా.. కనీసం కాంస్య పతకం దక్కుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రానున్న రెండో పతకం ఇది. అంతకుముందు వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను రజత పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. 

23ఏళ్ల లవ్లీనా ఒలింపిక్స్‌లో ఆడటం ఇదే తొలిసారి. అటు క్వార్టర్స్‌లో ప్రత్యర్థేమో మాజీ ప్రపంచ ఛాంపియన్‌. అయినప్పటికీ ఈ యువ బాక్సర్‌ ఏ మాత్రం బెదరలేదు. తొలి రౌండ్‌ నుంచే దూకుడుగా పంచ్‌లు విసిరింది. అయితే ప్రత్యర్థి కూడా అంతే దీటుగా ఆడింది. అయితే ముగ్గురు న్యాయమూర్తులు లవ్లీనాకు ఓటు వేయడంతో 3-2తో తొలి రౌండ్‌ను గెలుచుకుంది. రెండో రౌండ్‌లో మరింత దూకుడుగా ఆడి 5-0తో బౌట్‌ ముగించింది. మూడో రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ పోరులో 30-27, 29-28, 28-29, 30-27, 30-27తో లవ్లీనా ఘన విజయం అందుకుంది. 

చరిత్ర సృష్టించిన లవ్లీనా..

ఒలింపిక్‌ క్రీడల్లో బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం అందిస్తున్న మూడో బాక్సర్‌ లవ్లీనానే కావడం విశేషం. అంతకుముందు 2008లో విజేందర్‌ సింగ్‌, 2012లో మేరీ కోమ్‌ ఒలింపిక్‌ పతకం సాధించారు. వీరిద్దరికీ కాంస్యాలే దక్కాయి. అంతేగాక, బాక్సింగ్‌లో 69కేజీల విభాగంలో భారత్‌కు తొలి ఒలింపిక్‌ పతకం అందిస్తున్నది కూడా లవ్లీనానే. ఈమె గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్య పతకాలు గెలిచింది. 

ప్రముఖుల ప్రశంసలు..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం ఖాయమవడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. యువ బాక్సర్‌ లవ్లీనాపై ప్రశంసలు కురిపించారు. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు ట్విటర్‌ వేదికగా ఆమెను కొనియాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని