Team India: కోహ్లీ, రహానె, పుజారా ఇకనైనా పెద్ద స్కోర్లు చేయాలి: ఇంజమామ్

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, అజిక్య రహానె, చెతేశ్వర్‌ పుజారా ఇకనైనా భారీ స్కోర్లు సాధించాలని లేదంటే జట్టు కష్టాల్లో పడుతుందని పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 29 Aug 2021 15:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, చెతేశ్వర్‌ పుజారా ఇకనైనా భారీ స్కోర్లు సాధించాలని లేదంటే జట్టు కష్టాల్లో పడుతుందని పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ విశ్లేషించాడు. గతరెండేళ్లుగా కోహ్లీ, పుజారా ఒక్క సెంచరీ చేయలేకపోయారని గుర్తుచేశాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన ఇంజమామ్‌ భారత బ్యాట్స్‌మెన్‌పై తన అభిప్రాయాలు తెలిపాడు.

‘విరాట్‌ కోహ్లీ సుమారు రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోయాడు. పుజారా కూడా అంతే. మరోవైపు రహానె సైతం పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో టీమ్‌ఇండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్నా యువకులే కాపాడుతున్నారు. పంత్‌ చాలా పరుగులు చేశాడు. జడేజా కూడా వీలైనంత స్కోర్‌ సాధిస్తున్నాడు. అశ్విన్‌ కూడా చేతనైనన్ని పరుగులు చేశాడు. అనుభవజ్ఞులతో పోలిస్తే యువకులే ఎక్కువ పరుగులు చేస్తున్నారు’ అని ఇంజమామ్‌ పేర్కొన్నాడు.

ఇలాంటి పెద్ద సిరీస్‌లో టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ముందుండి నడిపించకపోతే వాళ్లే ఇబ్బందుల్లో పడతారు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి నేను భారత క్రికెట్‌ను గమనిస్తున్నా. వాళ్లెంతో బాగా ఆడుతున్నారు. కఠినపరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించారు. అయితే, అక్కడ యువకులే కీలకపాత్ర పోషించారు. కోహ్లీ నంబర్‌ వన్‌ ఆటగాడు. పుజారా, రహానె కూడా మంచి టెస్టు ఆటగాళ్లు. కానీ, ఇలా భారీ స్కోర్లు చేయకుండా ఎక్కువ కాలం కొనసాగితే యువకులు ఒత్తిడికి గురవుతారు. వాళ్లెంత బాగా ఆడుతున్నా సీనియర్లు ముందుండి నడిపించాలి. వాళ్లు ఇలాగే ఒత్తిడికి గురవుతూ ఉంటే సరిగ్గా ఆడలేరు. ఇప్పుడు ఇంగ్లాండ్‌ పర్యటనలోనూ ఇదే జరుగుతోంది’ అని పాక్‌ మాజీ సారథి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని