IPL 2021: నువ్వా నేనా సై.. చెన్నై x దిల్లీ ప్రివ్యూ

ఐపీఎల్‌ 14వ సీజన్‌ చివరి అంకానికి చేరింది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు చేసుకోగా ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి...

Published : 04 Oct 2021 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ చివరి అంకానికి చేరింది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు చేసుకోగా ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే టాప్‌లో నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ఈరోజు సాయంత్రం కీలక పోరులో తలపడనున్నాయి. ఇప్పటికే చెరో 18 పాయింట్లతో కొనసాగుతున్న ఈ రెండు జట్లు ఈరోజు విజయం సాధించి మరింత ఆధిపత్యం చెలాయించాలని ఆశిస్తున్నాయి. దీంతో మేటి జట్ల మధ్య అసలైన పోరు జరగనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చెన్నై ఎలా ఉంది?

గతేడాది పేలవ ఆటతీరుతో విఫలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెలరేగిపోతోంది. వరుస విజయాలతో ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న ధోనీసేన.. తనతో సమానంగా ఉన్న దిల్లీని ఈరోజు ఓడించాలని చూస్తోంది. దీంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లేముందు మరింత ఆత్మవిశ్వాసం పొందాలని భావిస్తోంది. అయితే, గత మ్యాచ్‌లో రాజస్థాన్‌తో ఓటమిపాలవ్వడమే ఇప్పుడు ఆ జట్టును కాస్త కలవర పెడుతోంది. ఫామ్‌ పరంగా చూసినా చెన్నై ఎదురులేని రీతిలో కొనసాగుతోంది. ఓపెనర్లు రుతురాజ్‌, ఫా డుప్లెసిస్‌ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అవసరమైన వేళ రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, బ్రావో, ధోనీ అండగా నిలుస్తున్నారు. బౌలింగ్‌లోనూ శార్దూల్‌, దీపక్‌ చాహర్‌లకు అండగా సామ్‌కరన్‌, మొయిన్‌ అలీ ఉన్నారు. దీంతో ఎలా చూసినా చెన్నై పటిష్టంగా ఉంది.

దిల్లీ బలంగా కనిపిస్తున్నా..

ఇక దిల్లీ గతేడాదిలాగే ఈసారి కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ధోనీసేనతో సమానంగా పోటీపడుతోంది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లోనే ఆ జట్టు బ్యాటింగ్‌ కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో 127 పరుగులే చేసిన ఆ జట్టు ముంబయితో ఆడిన గత మ్యాచ్‌లోనూ 130 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్‌ వరకూ తీసుకెళ్లింది. ఇదివరకు మ్యాచ్‌ల్లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, పృథ్వీషా ఈరోజు మ్యాచ్‌లో బ్యాట్లు ఝుళిపిస్తే చూడాలి. అదే జరిగితే చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు. ఆపై వచ్చే స్మిత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడకపోయినా పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఇక బౌలింగ్‌లో అవేశ్‌ఖాన్‌, అక్షర్‌ పటేల్‌ ప్రత్యర్థుల పనిపడుతూ జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే వీలుంది. మరి ఎవరు గెలిచి ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని