IPL 2021: ఇప్పుడు మా పరిస్థితి చెప్పడానికి మాటలు రావడం లేదు: పంత్‌

ఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడం నిరాశ కలిగించిందని, ఇప్పుడు తమ పరిస్థితి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదని దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు...

Updated : 11 Oct 2021 13:25 IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఓటమిపాలవ్వడం నిరాశ కలిగించింది

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడం నిరాశ కలిగించిందని, ఇప్పుడు తమ పరిస్థితి వివరించడానికి మాటలు రావడం లేదని దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో రెండు బంతులు మిగిలుండగానే చెన్నై విజయం సాధించింది. ఆ జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ (18; 6 బంతుల్లో 3x4, 1x6) చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ధోనీసేన ఐపీఎల్‌లో తొమ్మిదోసారి ఫైనల్‌ చేరింది. కాగా, దిల్లీ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా మరో అవకాశం ఉంది. ఎలినేటర్‌ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో తలపడనుంది.

‘కచ్చితంగా ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది. ఇప్పుడు మా పరిస్థితి వివరించడానికి కూడా మాటలు రావడం లేదు. ఇక మా ముందున్న ఏకైక మార్గం.. మా తప్పులను సరిచేసుకొని తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమవ్వడమే. ఈ మ్యాచ్‌లో టామ్‌కరన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కానీ, దురదృష్టంకొద్దీ చివరి ఓవర్‌లోనే పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌ మొత్తంలో ఎవరు బాగా బంతులేశారో అతడితోనే చివరి ఓవర్‌ వేయిస్తే బాగుంటుందని అనుకున్నా. అలాగే మేం సాధించిన 172 పరుగుల స్కోర్‌ సరిపోతుందని భావించా. కానీ, చెన్నై ఆటగాళ్లు పవర్‌ప్లేలో దంచికొట్టారు. తర్వాత మేం ఆశించినన్ని వికెట్లు తీయలేకపోయం. అదే ఓటమికి కారణం అయి ఉంటుంది. ఇక మా తప్పుల నుంచి నేర్చుకొని తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌ చేరతామనే ఆశిస్తున్నా’ అని రిషభ్‌ పంత్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని