IPL 2021: ఇది మాకు మేలుకొలుపులాంటిది.. ఏం చేయాలో తెలిసింది: కోహ్లీ

ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని రెండో దశలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమితో ఆరంభించింది. గతరాత్రి కోల్‌కతాతో తలపడిన టీ20లో కోహ్లీసేన చిత్తుగా ఓడిపోయింది. అయితే, మ్యాచ్‌ అనంతరం ఈ విషయంపై స్పందించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ...

Updated : 20 Sep 2022 15:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమితో ఆరంభించింది. గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్‌ అనంతరం స్పందించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ఇది తమకు మేలుకొలుపు లాంటిదని, ఈ ఓటమితో మున్ముందు ఏయే విషయాలపై దృష్టిసారించాలో తెలిసొచ్చిందని చెప్పాడు.

‘ఈ వికెట్‌పై మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం ఎంతో ముఖ్యం.  అయితే, ఆదిలోనే వికెట్‌పై తేమ అంత ప్రభావం చూపిస్తుందని మేం ఊహించలేదు. తొలుత బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌ ఎంచుకున్నాం. అలాగే 40 పరుగుల దాకా మేం ఒక్క వికెటే కోల్పోయాం. ఆ తర్వాత 20 పరుగుల్లోనే ఐదు వికెట్లు పోగొట్టుకున్నాం. ఇక అక్కడి నుంచి కోలుకునే ప్రసక్తే లేకపోయింది. ఇది మాకు మేలు కొలుపు లాంటిది. రెండో దశలో ఆదిలోనే ఇలా జరగడం వల్ల మున్ముందు ఏయే విషయాలపై దృష్టిసారించాలో తెలిసొచ్చింది. ఒక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు పడాలి’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

అనంతరం బెంగళూరును దెబ్బకొట్టిన కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిపై స్పందించిన కోహ్లీ.. త్వరలోనే అతడు టీమ్‌ఇండియాకు ఆడతాడన్నాడు. యువకుల నుంచి ఇలాంటి ప్రదర్శనలు చూడాలని, దాంతో టీమ్‌ఇండియా రిజర్వ్‌ బెంచ్‌ ఎంత బలంగా ఉందో తెలుస్తుందని అతడు చెప్పుకొచ్చాడు. ఇక బెంగళూరు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు గెలిచిందని, అప్పుడప్పుడూ ఓటములు కూడా ఎదురౌతాయని ఆర్సీబీ కెప్టెన్‌ పేర్కొన్నాడు. ఇవన్నీ ఆటలో భాగమని తెలిపాడు. అయితే, విజయాలలాగే వైఫల్యాలకు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పాడు. కచ్చితమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని, ఈ జట్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని కోహ్లీ వివరించాడు. ఇక రాబోయే మ్యాచ్‌ల్లో పూర్తిస్థాయిలో రాణించి మంచి ప్రదర్శనలు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని