IPL 2021: ఈ నాలుగింట్లో.. ప్లేఆఫ్స్ చేరేదెవరు?

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్‌పై పడింది. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు...

Updated : 05 Oct 2021 12:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్‌పై పడింది. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ స్థానాలను ఖరారు చేసుకోగా పది ఓటములతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఈ రేసు నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. అందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆధిక్యంలో ఉండగా తర్వాతి స్థానాల్లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్, ముంబయి ఇండియన్స్ ఉన్నాయి. అయితే, ఇందులో ప్రధానంగా కోల్‌కతాకే ఎక్కువ అవకాశాలున్నాయి.

అడుగు దూరంలో కోల్‌కతా..

(Photo: KKR Twitter)

కోల్‌కతా ఇప్పటికే ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రన్‌రేట్‌ (+0.294) పరంగా చూసినా మిగతా మూడు జట్ల కన్నా మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. మరోవైపు గురువారం రాజస్థాన్‌తో చివరి మ్యాచ్‌లో ఆడాల్సి ఉండగా అందులో గెలిస్తే నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక కోల్‌కతా ఓడితే తర్వాతి స్థానాల్లో ఉన్న రాజస్థాన్‌ లేదా ముంబయి నాలుగో స్థానం కోసం పోటీపడే వీలుంది.

కోల్‌కతా ఓటమే.. ముంబయికి అవకాశం

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ ఈ సీజన్‌లో కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలే సాధించి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పంజాబ్‌, రాజస్థాన్‌ జట్లతో సమానంగా 10 పాయింట్లతో కొనసాగుతున్నా.. రన్‌రేట్‌ (-0.453) పరంగా వెనుకంజలోనే కొట్టుమిట్టాడుతోంది. అయితే, రోహిత్‌ సేన ఇంకా హైదరాబాద్‌, రాజస్థాన్‌ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు.. రాజస్థాన్‌ చేతిలో కోల్‌కతా ఓడితే తప్పా ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం లేదు.

రాజస్థాన్‌ రెండు గెలిస్తే తప్ప..

రాజస్థాన్‌ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి ఆరో స్ధానంలో నిలిచింది. రన్‌రేట్‌ (-0.337) పరంగా ముంబయికి ఎక్కువ (-0.453), పంజాబ్‌కి (-0.241) తక్కువగా ఉంది. ఇక ఈ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ముంబయి, కోల్‌కతాను ఓడిస్తే ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌ కోల్పోయినా ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపు అసాధ్యం. ఒకవేళ లీగ్‌ దశ అయిపోయేసరికి మిగతా మూడు జట్లతో సమానంగా 12 పాయింట్లతో నిలిస్తే అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ ఉంటే అవకాశం ఉంది.

పంజాబ్‌ అదృష్టం కష్టమే..

(Photo: PBKS Twitter)

ఇక పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ చేరాలంటే అద్భుతాలే జరగాలి. అవి దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రాహుల్‌ టీమ్‌ ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి (-0.241) రన్‌రేట్‌తో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. చెన్నైతో ఆడాల్సిన చివరి మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో గెలవాలి. అది కూడా రాజస్థాన్‌ చేతిలో కోల్‌కతా సైతం 70 పరుగుల తేడాతో ఓటమిపాలైతేనే. అందుకే పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టం. రెండు మ్యాచ్‌ల్లో అద్భుతాలు జరిగితే తప్ప పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ చేరదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని