
India vs England: ఇదీ మన బౌలర్ల విజృంభణ
ఇంటర్నెట్ డెస్క్: ఆంగ్లేయుల గడ్డపై టీమ్ఇండియా దుమ్మురేపుతోంది. నాలుగో టెస్టులో అద్వితీయ విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత ఓవల్ మైదానంలో గెలుపు బావుటా ఎగరేసింది. ఆశల్లేని స్థితిలోంచి పుంజుకొని అద్భుతంగా మ్యాచును ముగించింది.
ఈ మ్యాచులో టీమ్ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 191 పరుగులే చేసింది. ఇంగ్లాండ్ 290తో బదులివ్వడంతో రెండో ఇన్నింగ్స్లో కోహ్లీసేన భారీ స్కోరు చేయాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టే ఆటగాళ్లంతా సమష్టిగా ఆడి 466 పరుగులు చేశారు. రోహిత్ (127) శతకంతో అదరగొట్టగా.. పుజారా (61), రిషభ్ పంత్ (50), శార్దూల్ ఠాకూర్ (60) అర్ధశతకాలు బాదేశారు. ఇక కేఎల్ రాహుల్ (46), విరాట్ కోహ్లీ (44), ఉమేశ్ యాదవ్ (25), జస్ప్రీత్ బుమ్రా (24) సమయోచితంగా ఆడారు.
ఆఖరి రోజు లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్కు గెలిచేందుకు లేదా డ్రా చేసుకొనేందుకు అవకాశాలు కనిపించాయి. ఓపెనర్లు రోరీ బర్న్స్ (50), హసీబ్ హమీద్ (63) తొలి వికెట్కు వంద పరుగుల భాగస్వామ్యం అందించడమే కారణం. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. బుమ్రా (2/27) రివర్స్స్వింగ్తో దాడి చేయగా మరో ఎండ్లో గరుకు బంతులేస్తూ జడ్డూ (2/50) ఉక్కిరిబిక్కిరి చేశాడు. శార్దూల్ (2/22), ఉమేశ్ (3/60) తమ వంతు బాధ్యతగా వికెట్లు తీశారు.
ఈ క్రమంలో టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్గా బుమ్రా రికార్డు సృష్టించాడు. భారత బౌలర్లు వేసిన ఒక్కో బంతి.. ఆంగ్లేయులకు గండంగా తోచింది. మనోళ్లు వికెట్లు తీసిన విధానం మీరూ చూసేయండి!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.