INDvsENG: రూట్‌ శతకమోత.. సంపూర్ణ ఆధిక్యంలో ఇంగ్లాండ్‌

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ సంపూర్ణ ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆ జట్టు 423/8 స్కోర్‌తో మ్యాచ్‌పై పూర్తి పట్టుసాధించింది...

Updated : 26 Aug 2021 23:33 IST

రెండో రోజు ఆటపూర్తయ్యేసరికి ఇంగ్లాండ్‌ 423/8

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ సంపూర్ణ ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆ జట్టు 423/8 స్కోర్‌తో నిలిచి మ్యాచ్‌పై పూర్తి పట్టుసాధించింది. రెండో రోజు చివరి సెషన్‌ మినహా భారత బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇప్పటికే 345 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మూడో రోజు ఉదయం వేళ టీమ్‌ఇండియా ఆ చివరి రెండు వికెట్లను ఎంత వీలైతే అంత త్వరగా తీయాలి. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఏ మేరకు పోరాడతారో చూడాలి. ఇక గురువారం ఆట నిలిచిపోయేసరికి ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ క్రేగ్‌ ఓవర్టన్‌(24; 31 బంతుల్లో 4x4), రాబిన్‌సన్‌(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు కెప్టెన్‌ జోరూట్‌ (121; 165 బంతుల్లో 14x4), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ (70; 128 బంతుల్లో 11x4) భారీ స్కోర్లు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 139 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ను తిరుగులేని స్థితిలో నిలిపారు.

ఇక 120/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండోరోజు ఆట ప్రారంభించిన ఓపెనర్లు రోరీబర్న్స్‌(61; 153 బంతుల్లో 6x4, 1x6), హసీబ్‌ హమీద్‌(68; 195 బంతుల్లో 12x4) అర్ధశతకాలతో రాణించారు. వీరిద్దరూ తొలిసెషన్‌లోనే స్వల్ప వ్యవధిలో ఔటైనా రూట్‌, మలన్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. అప్పటికీ జట్టు స్కోర్‌ 182/2గా నమోదైంది. అనంతరం రెండో సెషన్‌లో మరింత వేగంగా ఆడిన ఇద్దరూ అర్ధశతకాలు సాధించడంతో పాటు శతకాల వైపు దూసుకెళ్లారు. అయితే, సిరాజ్‌ వేసిన 94వ ఓవర్‌ చివరి బంతికి మలన్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో ఇంగ్లాండ్‌ 298 పరుగుల వద్ద మూడో వికట్‌ కోల్పోయింది. అప్పటికే ఇంగ్లాండ్‌ పటిష్ఠస్థితిలో నిలిచింది. టీ బ్రేక్‌ అనంతరం రూట్‌ శతకం పూర్తి చేసుకోగా తర్వాత ఇంగ్లాండ్‌ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. బెయిర్‌స్టో(29), బట్లర్‌(7)ను షమి ఔట్‌ చేశాడు. ఆపై  రూట్‌ను బుమ్రా, మొయిన్‌ అలీ(8)ని జడేజా పెవిలియన్‌ పంపారు. మ్యాచ్‌ ముగిసేముందు సామ్‌కరన్‌(15) సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాంతో ఇంగ్లాండ్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఓవర్టన్‌, రాబిన్‌సన్‌ నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో షమి మూడు.. సిరాజ్‌, జడేజా చెరో రెండు.. బుమ్రా ఒక వికెట్‌ తీశారు.

రూట్‌ శతకాల రికార్డు..

మరోవైపు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌.. ఈ సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లోనూ సెంచరీలు బాదాడు. దాంతో భారత్‌పై అత్యధిక శతకాలు బాదిన ఐదో క్రికెటర్‌గా అతడు కొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు గ్యారీసోబర్స్‌, వీవ్‌రిచర్డ్స్‌, రికీపాంటింగ్‌, స్టీవ్‌స్మిత్‌ తలా ఎనిమిది శతకాలు సాధించారు. ఇప్పుడు వారి సరసన రూట్‌ కూడా చోటు దక్కించుకోవడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని