T20 World Cup: తుదిపోరులో ఆసీస్‌ వైపే పీటర్సన్‌, అక్రమ్‌ మొగ్గు

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియానే విజయం సాధిస్తుందని మాజీ ఆటగాళ్లు కెవిన్‌ పీటర్సన్‌, వసీమ్‌ అక్రమ్‌ అన్నారు. ఇద్దరూ వేర్వేరు వేదికల్లో స్పందిస్తూ కంగారూలకే ఓటేశారు...

Published : 14 Nov 2021 15:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియానే విజయం సాధిస్తుందని మాజీ ఆటగాళ్లు కెవిన్‌ పీటర్సన్‌, వసీమ్‌ అక్రమ్‌ అన్నారు. ఇద్దరూ వేర్వేరు వేదికల్లో స్పందిస్తూ కంగారూలకే ఓటేశారు. పీటర్సన్‌ ఓ బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చాడు. ‘న్యూజిలాండ్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా ఆసీస్‌ జట్టే ఫేవరెట్‌గా అనిపిస్తుంది. ఇదివరకు జరిగిన కీలక మ్యాచ్‌ల్లోనూ కివీస్‌పై ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ అందుకు నిదర్శనం. దీంతో ఈరోజు కూడా ఆ జట్టు విజయం సాధిస్తుంది’ అని పేర్కొన్నాడు.

‘చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా చెలరేగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే తీరుతారు. అందుకే ఆ జట్టు ఎన్నో ఏళ్ల పాటు ఎదురులేని జట్టుగా కొనసాగింది. వాళ్లు ఏదైనా కీలక టోర్నీల్లో సెమీఫైనల్‌ చేరారంటే కచ్చితంగా అదనపు శక్తిని సంపాదించుకుంటారు. అందుకు డేవిడ్‌ వార్నరే పెద్ద ఉదాహరణ. ఐపీఎల్‌లో అతడు సన్‌రైజర్స్‌ తరఫున పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డాడు. ఈ ప్రపంచకప్‌లో జట్టుకు అవసరమైన వేళ తానేంటో చేసి చూపించాడు’ అని పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక వసీమ్‌ అక్రమ్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా ఫేవరెట్‌ జట్లలో ఒకటి కాదని చెప్పాడు. అంతకుముందు ఆడిన పొట్టి సిరీస్‌ల్లో ఆ జట్టు ప్రదర్శన ఏ మాత్రం బాగోలేదని గుర్తుచేశాడు. టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్‌ వార్నర్‌ కీలక ఆటగాడని, అతడు దూకుడైన బ్యాట్స్‌మన్‌ అని పేర్కొన్నాడు. అతడు సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చాడని కితాబిచ్చాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో తలపడే తుదిపోరులో కంగారూలు విజయం సాధించే అవకాశాలే కాస్త ఎక్కువగా ఉన్నాయన్నాడు. ప్రస్తుత జట్టులో స్టీవ్‌స్మిత్‌ పరుగులు చేయలేకపోతున్నా ఆ జట్టు బలంగా ఉందన్నాడు. మాక్స్‌వెల్‌, స్టాయినిస్‌ కీలకమని అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని