ధోనీ లేడు.. కుల్‌దీప్‌ దారి వెతకాలి

వికెట్లు తీసేందుకు కుల్‌దీప్‌ యాదవ్‌ ఏదో ఒక దారి వెతకాలని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ వెంకటపతి రాజు అన్నారు. అతడికి సలహాలిచ్చేందుకు ఇప్పుడు ధోనీ లేడని గుర్తు చేశారు. శ్రీలంక సిరీస్‌ అతడికి మంచి అవకాశమని తెలిపారు...

Published : 17 Jul 2021 01:06 IST

మాజీ స్పిన్నర్‌ వెంకటపతి రాజు

కొలంబో: వికెట్లు తీసేందుకు కుల్‌దీప్‌ యాదవ్‌ ఏదో ఒక దారి వెతకాలని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ వెంకటపతి రాజు అన్నారు. అతడికి సలహాలిచ్చేందుకు ఇప్పుడు ధోనీ లేడని గుర్తు చేశారు. శ్రీలంక సిరీస్‌ అతడికి మంచి అవకాశమని తెలిపారు. ఇక్కడ రాణిస్తే ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.

‘శ్రీలంక పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయి. కుల్‌దీప్‌ పునరాగమనానికి ఇవి అనువైనవి. ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ జరిగే యూఏఈలోనూ పిచ్‌లు ఇలాగే ఉంటాయి. దాంతో కుల్‌దీప్‌ మ్యాచ్‌ విజేతగా మారే అవకాశాలూ ఉన్నాయి. అతడి కెరీర్లో సారథుల పాత్రే కీలకంగా మారింది. ధోనీ నేతృత్వంలో బాగా రాణించానని అంటుంటాడు. కానీ ఇప్పుడతను లేడు. కాబట్టి ఏదో ఒక దారి వెతకాలి’ అని రాజు అన్నారు.

‘కుల్‌దీప్‌ యువకుడు. తెలివైన బౌలర్‌. అంతర్జాతీయ అనుభవం ఉంది. వికెట్లు తీయడంపై ఏకాగ్రత పెడితే మంచిది. పరిమిత అవకాశాలే దొరుకుతాయని అతడు దృష్టిలో పెట్టుకొని ఆడాలి. ఒత్తిడి చెందొద్దు. వైవిధ్యం ప్రదర్శించాలి. క్రికెట్‌ సులభం కాదని అతడికి తెలుసు. కఠోరంగా శ్రమించాలి. కుల్‌దీప్‌కు ఓ మంచి అలవాటుంది. ఒక వికెట్‌ పడగొట్టాడంటే చాలు మ్యాచులో రెండు లేదా మూడు వికెట్లు తీస్తుంటాడు’ అని రాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని