రాజస్థాన్‌ రాయల్స్‌కు ఊహించని పరిణామం.. ఐపీఎల్‌కు జోస్‌ బట్లర్‌ దూరం

వచ్చేనెల జరిగే ఐపీఎల్‌ 2021 మిగతా సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు...

Published : 21 Aug 2021 22:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చేనెల జరిగే ఐపీఎల్‌ 2021 మిగతా సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టే ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. బట్లర్‌ సతీమణి లూయిస్‌ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని, అందుకోసమే అతడు మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని ఆ జట్టు స్పష్టం చేసింది.

భారత్‌లో నిర్వహించిన టోర్నీలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఐపీఎల్‌ మే 4న అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకులు మిగతా సీజన్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో తిరిగి నిర్వహించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. రాజస్థాన్‌ ఆటగాళ్లు కూడా త్వరలోనే అక్కడికి వెళ్లనున్నారు. ఇంతలోనే బట్లర్‌ దూరమయ్యాడని ఆ జట్టు ప్రకటించింది. ఇక ఈ సీజన్‌ మధ్యలో నిలిచిపోయేసరికి ఆ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, నాలుగు ఓటములతో ఐదో స్థానంలో నిలిచింది. ఇకపై మెరుగైన ప్రదర్శన చేస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేకపోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని