T20 World Cup: వార్నర్‌ని ఎంపిక చేయడం కచ్చితంగా తప్పుడు నిర్ణయమే: అక్తర్

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ని ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా ఎంపిక చేయడం తప్పుడు నిర్ణయమని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అసహనం వ్యక్తం చేశాడు...

Published : 15 Nov 2021 16:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ని ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా ఎంపిక చేయడం తప్పుడు నిర్ణయమని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇది సరైన నిర్ణయం కాదన్నాడు. ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో వార్నర్‌ (53) అర్ధ శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఈ టోర్నీలో మొత్తం 289 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 303 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. అయినా, అతడిని కాదని వార్నర్‌ని ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా ఎంపిక చేయడం అక్తర్‌కు నచ్చలేదు.

‘బాబర్‌ అజామ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా ఎంపిక అవుతాడని నేను నిజంగా ఎదురుచూశాను. ఇది కచ్చితంగా సరైన నిర్ణయం కాదు’ అని తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ఈ టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు వార్నర్‌ ఫామ్‌ కోల్పోయి సతమతమయ్యాడు. ఐపీఎల్‌లోనూ పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డాడు. అయినా, ఏడు మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలతో రాణించాడు. ఒకవైపు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ విఫలమవుతున్న వేళ మరోవైపు టాప్‌ ఆర్డర్‌లో కీలక సమయాల్లో అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా పాక్‌తో సెమీస్‌లో 49, కివీస్‌తో ఫైనల్లో 53 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా ఎంపిక చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని