Tokyo Olympics: అయ్యో సోనమ్‌! ఆఖరి 35 సెకన్లు నిలిస్తే..

ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ నిరాశ పరిచింది. తొలి రౌండ్‌లోనే మంగోలియాకు

Updated : 03 Aug 2021 11:03 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ పోటీలు మొదలయ్యాయి. అచ్చొచ్చిన ఈ క్రీడలో భారత్‌కు శుభారంభమైతే దక్కలేదు. మహిళల 62 కిలోల విభాగంలో యువ రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ తొలిరౌండ్లో ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచును అతి రక్షణాత్మకంగా ఆడి చేజార్చుకుంది.

మంగోలియాకు చెందిన బొలొర్తుయా ఖురెల్ఖుతో 19 ఏళ్ల సోనమ్‌ తలపడింది. తొలి మూడు నిమిషాల్లోనే ఆమె 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత దూకుడు తగ్గించి రక్షణాత్మక విధానం ఎంచుకుంది. అదే ఆమె కొంప ముంచింది. ఆట మరో 35 సెకన్లలో ముగుస్తుందనగా ఆసియా రజత పతక విజేతైన బొలొర్తుయా.. సోనమ్‌ను (టేక్‌ డౌన్‌) ఎత్తిపడేసింది. దాంతో స్కోరు 2-2తో సమమైంది. ఆఖరి పాయింట్‌ చేసింది మంగోలియన్‌ కాబట్టి న్యాయనిర్ణేతలు ఆమెనే విజేతగా ప్రకటించారు.

ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత బొలొర్తుయా బల్గేరియాకు చెందిన తయెబ్‌ ముస్తఫా యూసెన్‌తో తలపడి ఓటమి పాలైంది. దాంతో ఇక సోనమ్‌కు రెపిచేజ్‌ అవకాశం లేకుండా పోయింది. ‘మంగోలియన్‌తో పోలిస్తే సోనమ్‌ మెరుగైన రెజ్లరే. అతి రక్షణాత్మకంగా ఆడి పొరపాటు చేసింది. ఏదేమైనప్పటికీ ఆమెకు అత్యున్నత క్రీడల్లో తలపడ్డ అనుభవం వచ్చింది’ అని ఆమె కోచ్‌ అజ్మెర్‌ మాలిక్‌ అన్నారు.

సోనమ్‌కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం గమనార్హం. ఆమె 2017, 2019లో క్యాడెట్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. బుధవారం రవి దహియా (75 కిలోలు), దీపక్‌ పునియా (86 కిలోలు), అన్షు మాలిక్‌ (57 కిలోలు) బరిలోకి దిగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని