Steve Smith: స్టీవ్‌స్మిత్‌కు 55 నిమిషాలు వింత అనుభవం.. లిఫ్ట్‌లో ఇరుక్కొని..!

ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌కు వింత అనుభవం ఎదురైంది. తాజాగా అతడు మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌లో జట్టుతో సహా బస చేయగా అందులోని లిఫ్ట్‌లో చిక్కుకుపోయాడు...

Published : 31 Dec 2021 18:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌కు వింత అనుభవం ఎదురైంది. తాజాగా అతడు మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌లో జట్టుతో సహా బస చేయగా అందులోని లిఫ్ట్‌లో చిక్కుకుపోయాడు. స్మిత్‌ ఎలివేటర్‌ ఎక్కగానే సాంకేతిక కారణాలతో అది నిలిచిపోయింది. దీంతో ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ 55 నిమిషాల పాటు అందులోనే ఒంటరిగా ఉండిపోయాడు. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. తన సహచర ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ సైతం స్మిత్‌ను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. చివరికి మెకానిక్‌ అక్కడికి చేరుకొని దాని డోర్లను తెరవడంతో ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఊపిరి పీల్చుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను స్మిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకొని ఈ విషయాన్ని తెలియజేశాడు.

‘నేను లిఫ్ట్‌లోకి ఎక్కి చిక్కుకుపోయా. ప్రస్తుతం నేను ఉండే ఫ్లోర్‌లోనే ఉన్నా కానీ, ఈ ఎలివేటర్‌ డోర్లు తెరుచుకోవడం లేదు. నన్ను బయటకు తీసుకొచ్చేందుకు లబుషేన్‌ కూడా మరోవైపు నుంచి ప్రయత్నిస్తున్నాడు. కానీ బయటపడటానికి వీలు కావడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే నేను అనుకున్నట్లుగా ఈ సాయంత్రం గడవలేదు’ అని ఆస్ట్రేలియా వైస్‌ కెప్టెన్‌ విచారం వ్యక్తం చేశాడు. ఇక దాని నుంచి బయటపడ్డాక క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అందులో ఉన్న 55 నిమిషాలు ప్రత్యేక అనుభవమని పేర్కొన్నాడు. కాగా, స్మిత్‌ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో నాయకత్వం వహించి జట్టును విజయపథంలో నడిపించాడు. 2018 బాల్‌ టాంపరింగ్‌ వివాదం తర్వాత అతడు మళ్లీ జట్టు పగ్గాలు అందుకుంది ఇదే తొలిసారి. మరోవైపు యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ ఇప్పటికే తొలి మూడు టెస్టులు గెలిచి 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే మిగిలిన రెండు టెస్టులు గెలుపొంది సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని