Virat Kohli: టీమ్‌ఇండియాపై పాక్‌ విష ప్రచారం.. అసలు నిజం ఏంటంటే?

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గత రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌లపై విజయం సాధించాక పాకిస్థాన్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారు...

Published : 08 Nov 2021 01:20 IST

అఫ్గాన్‌ టాస్‌ గెలిచినప్పుడు కోహ్లీ అలా చెప్పలేదు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గత రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌లపై విజయం సాధించాక పాకిస్థాన్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గత బుధవారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ వీడియోను జత చేస్తూ టీమ్‌ఇండియాపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేస్తున్నారు. అందులో అఫ్గాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబి టాస్‌ గెలిచాక ‘బౌలింగ్‌ ఫస్ట్‌’ అనే మాటలు వినిపించాయి. అయితే.. ఆ మాటలు కోహ్లీ అన్నాడని, దీంతో టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌ను ఫిక్సింగ్‌ చేసిందని పాక్‌ అభిమానులు పోస్టులు పెట్టారు.

నిజం ఏమిటంటే..

ఏ మ్యాచ్‌లోనైనా టాస్‌ గెలిచిన కెప్టెన్‌ తాము బ్యాటింగ్‌ ఎంచుకుంటామా.. లేక బౌలింగ్‌ తీసుకుంటామా అనే విషయాన్ని ప్రత్యర్థి సారథికి తెలపడం ఆనవాయితి. ఈ క్రమంలోనే అప్పుడు టాస్‌ గెలవగానే నబి.. కోహ్లీతో ‘బౌలింగ్‌ ఫస్ట్‌’ అన్నాడు. ఆ సమయంలో కోహ్లీ పెదవులు కూడా కదలలేదు. తర్వాత వ్యాఖ్యాత దగ్గరకు వెళ్లిన నబీ.. తాము తొలుత బౌలింగ్‌ చేస్తామని చెప్పాడు. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా ధ్రువీకరించింది. ఆ మ్యాచ్‌కు సంబంధించి టాస్ సందర్భంలో తీసిన వీడియోలు ఒకటికి రెండుసార్లు పరిశీలించి.. అందులోని నిజానిజాలు వెలుగులోకి తీసుకొచ్చింది. కోహ్లీ ఆ సమయంలో నబీతో ఏం చెప్పలేదని..  ఇది కేవలం పాక్‌ అభిమానులు టీమ్‌ఇండియాపై చేస్తోన్న విష ప్రచారమని బట్టబయలు చేసింది. నబీ చెప్పిన ‘ఫస్ట్‌ బౌలింగ్‌’ అనే మాటలను కోహ్లీ చెప్పినట్లు పాక్‌ అభిమానులు ఫేక్‌ న్యూస్‌ సృష్టించారని స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని